
భద్రాచలం, వెలుగు : సికిల్ సెల్అనీమియా పట్ల ఏజెన్సీ ప్రజలు అలర్ట్గా ఉండాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ సూచించారు. ప్రపంచ సికిల్సెల్అనీమియా దినోత్సవం సందర్భంగా గురువారం భద్రాచలంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీ గిరిజన గూడేల్లో గిరిజన పిల్లలకు వారసత్వంగా ఈ వ్యాధి సంక్రమిస్తోందని, వ్యాధిని త్వరగా గుర్తించి సరైన వైద్యం అందిస్తే నయమవుతుందని తెలిపారు.
అందరూ రక్తపరీక్షలు చేయించుకునేలా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ పీవోతో సహా ఏజన్సీలో వైద్య సిబ్బంది గిరిజనుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుని పనిచేస్తున్నందున దేశంలోనే జిల్లాకు గుర్తింపు వస్తుందని ప్రశంసించారు. ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు పీహెచ్సీల్లో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టినందుకు మంచి పేరు వచ్చిందని తెలిపారు.
ఇదే స్ఫూర్తితో ఆదివాసీ గ్రామాల్లో సికిల్ సెల్ అనీమియా వ్యాధి పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ ఏజెన్సీలో సికిల్ సెల్ అనీమియా వ్యాధి నియంత్రణకు 2047 సంవత్సరం వరకు గోల్ పెట్టుకున్నామని, ఈ మహత్తర కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పీవో బి.రాహుల్ మాట్లాడుతూ ఈ రుగ్మతను ఎదుర్కొనేందుకు నీరు ఎక్కువగా తాగాలని సూచించారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలన్నారు. 130 గ్రామ పంచాయతీలలో క్యాంపులు నిర్వహించి ప్రతి ఒక్కరికీ టెస్టింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎం హెచ్వో భాస్కర్నాయక్ తదితరులు పాల్గొన్నారు.