ఓ వ్యక్తికి 10 నెలలుగా  43సార్లు పాజిటివ్

ఓ వ్యక్తికి 10 నెలలుగా  43సార్లు పాజిటివ్

లండన్: కరోనా ఏంటి.. ఓ వ్యక్తిని టార్గెట్ చేయడం ఏమిటని అనుకుంటున్నారా.. కేసు వివరాలు చూస్తే మీరు చదివిన టైటిల్ అచ్చు తప్పేం కాదు.. నిజ్జంగా నిజం అని అర్థం అవుతుంది. కరోనా గురించి రకరకాల కథలు.. కథనాలలే కాదు గతంలో ఎన్నడూ చూడని, వినని వింతలు, విడ్దూరాలే కాదు.. సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్న ఆధునిక మానవుడి శక్తి సామర్ధ్యాలను సవాల్ చేస్తున్న ఉదంతాలు ఎన్నోచూశాం.. ఇప్పటికీ చూస్తున్నాం. ఇదే కోవలోనే వైద్య శాస్త్రం అవపోసన పట్టిన వారికి అంతుబట్టని కరోనా కేసుల్లో ఓ ప్రత్యేక కేసు ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది వైద్య నిపుణులు అధ్యయనానికి పురిగొల్పుతోంది. వివరాలు ఇలా ఉన్నాయి. 

ఇంగ్లండ్ లోని బ్రిస్టల్ ప్రాంతానికి చెందిన 72 ఏళ్ల డేవ్ స్మిత్ డ్రైవింగ్ ఇన్ స్ట్రక్టర్ గా పనిచేసి రిటైర్ అయి విశ్రాంత జీవితం గడుపుతున్నాడు. కరోనా ప్రబలిన మొదట్లోనే అంటే గత ఏడాది మార్చిలోనే ఇతనికి కరోనా సోకింది. వైద్యుల సూచన మరకు ఇంట్లోనే క్వారంటైన్ ఉంటూ చికిత్స తీసుకున్నాడు. అయితే ఎంతకూ తగ్గకపోవడంతోపాటు.. చివరకు తింటున్న పదార్థాల రుచి, వాసన శక్తిని కోల్పోయిన విషయం గుర్తించి వైద్యులను సంప్రదించాడు. కొద్ది రోజులు ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని ఇంటికి తిరిగొచ్చినా అనారోగ్యం మళ్లీ వెంటాడింది. ఇంటి నుంచి బయటకువెళ్లే శక్తి లేని పరిస్థితి రావడంతో గత ఏడాది జులైలో మళ్లీ ఆస్పత్రిలో చేరాడు.

వైద్యులు వెంటనే కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా తేలింది. మొదటి సారి కూడా ఆయన కరోనా బారినపడి ఉంటాడని అనుమానించి జీనోమ్ సీక్వెన్సింగ్ చేయించారు. తొలిసారి సోకిన కరోనా వైరస్ నుంచే ఆయన కోలుకోలేదని నిర్ధారణ అయింది. దీంతో ఆశ్చర్యపోయిన వైద్యులు ఈయన రక్త నమూళాల మిస్టరీని తేల్చేందుకు బ్రిస్టోల్ యూనివర్సిటీలోని పరిశోధకులకు పంపారు. ఆ తర్వాత నుంచి వరుసగా 10 నెలల నుంచి పంపిస్తుండగా.. 43 సార్లు కరోనా పాజిటివ్ గానే నిర్ధారణ అయింది. టెస్టులు చేసిన ప్రతిసారి కరోనా పాజిటివ్ వస్తుండడంతో వైద్యులు స్పెషల్ కేసుగా టేకప్ చేసి కేసును ఛాలెంజ్ గా స్వీకరించారు. ఒకసారి రెండు నెలలపాటు ఈయన బెడ్ పై నుంచి లేవలేని స్థితిలో ఉండగా.. ప్రత్యేక ద్రవ ఆహారంతో ఆయనను కోలుకునేలా చేశారు. చాలా రోజులపాటు బెడ్ పైనే ఉంటూ మలమూత్రాలకు కూడా లేవలేక పోతుంటే కంటతడిపెట్టుకున్నాడు. ఎంతో ఓపికగా వైద్యులు తన కోసం ప్రయత్నాలు చేస్తుండడం.. కుటుంబ సభ్యుల కష్టాలు చూసి తన కోసం మీరెందుకు కష్టపడతారని.. అంత్యక్రియలకు ఏర్పాట్లు  చేయమని చెప్పాడు. ఏడాదిగా నరకం చూస్తున్నానంటూ కంటతడిపెట్టకుంటే వైద్య నిపుణులు ధైర్యం చెప్పి ఓదార్చారు. కేసును ఛాలెంజ్ గా స్వీకరించామని.. మీరు కాస్త ఓపికగా ఉండాలని చెప్పిన మాటలు మంత్రంలా పనిచేశాయి. 
చివరి చికిత్సగా రెజినెరాన్ యాంటిబాడీ థెరపీని ప్రారంభించగా.. ఆయన శరీరం సానుకూంగా స్పందించడంతో వైద్యులు ఆశ్చర్యపోయారు. కుటుంబ సభ్యులకు ఇదే విషయం చెప్పి.. ఇరువురు కలసి ఆయనకు స్వాంతన కలిగేలా పలు రకాల ప్రయత్నాలు చేశారు. బాగా కోలుకుంటున్నట్లు కనిపించారు. ఇప్పటికే 290 రోజుల్లో 43 సార్లు పాజిటివ్ వచ్చినట్లు నమోదు చేసుకున్న వైద్యులు 305 రోజున కరోనా పరీక్ష చేయగా.. నెగటివ్ గా నిర్ధారణ అయింది. అనుమానంతో పలు రకాల పరీక్షలు చేసినా నెగటివ్ రావడంతో వైద్యులు, కుటుంబ సభ్యులు సంబరపడ్డారు. వైద్యులు, కుటుంబ సభ్యులతోపాటు.. కోలుకున్న డేవ్ స్మిత్ ఉద్వేగానికి లోనయ్యాడు. చాలా కాలం శరీరం నిస్సత్తువగా మారడంతో.. ఇక బతకనేమోననిపించిందని.. అయితే వైద్యులు, కుటుంబ సభ్యులు ఎంతో శ్రమించి తనకు చికిత్స చేసి పునర్జన్మను ప్రసాదించారని ఆనందం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా తన సతీమణి ఏడాదిగా తన గురించి నరకం అనుభవించడం మామాలు మాటల్లో చెప్పలేనని కంటతడిపెట్టుకున్నాడు.