- ఫీజులు కడితేనే.. పిల్లలు ఇంటికి
- పేరెంట్స్పై ఒత్తిడి పెంచిన కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు
- 8 నుంచి సంక్రాంతి సెలవుల ప్రకటనతో టార్గెట్ పెట్టి మరీ వసూళ్లు
- డబ్బులు కట్టకపోతే పిల్లలను ఎగ్జామ్స్ రాయనీయట్లే
- ఫీజుల దందాపై పట్టించుకోని విద్యా శాఖ
హైదరాబాద్, వెలుగు: ‘‘ఈ నెల 8 నుంచి సెలవులున్నాయి. ఆ రోజు ఇక్కడికి వచ్చి కాలేజీ, హాస్టల్ ఫీజు మొత్తం చెల్లించి మీ అమ్మాయిని హాస్టల్ నుంచి తీసుకుపోండి’’ఇది హైదరాబాద్లోని ఓ కార్పొరేట్కాలేజీ నుంచి పేరెంట్కు వచ్చిన కాల్.
‘‘పిల్లలకు ఎగ్జామ్స్ పెడుతున్నం. మొత్తం ఫీజు కడితేనే ఎగ్జామ్స్ రాయనిస్తం, లేకుంటే మీ బాబును బడికి పంపకండి’’ ఇదీ నగర శివారులోని ఓ ప్రైవేటు స్కూల్ టీచర్ నుంచి పేరెంట్కు వచ్చిన కాల్.
ఇలాంటి కాల్స్, మెసేజ్లు కేవలం వీరికే కాదు.. రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో తమ పిల్లలను చదివించే మెజార్టీ పేరెంట్స్కు సోమవారం రాత్రి నుంచి వస్తున్నాయి. ఈ నెల 8 నుంచి స్కూళ్లు, కాలేజీలకు సర్కార్ సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో ప్రైవేటు మేనేజ్మెంట్లు వసూళ్ల దందాకు తెరలేపాయి. ఈ అకడమిక్ ఇయర్ మొత్తం ఫీజునూ ఇప్పుడే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో పేరెంట్స్లో ఆందోళన మొదలైంది.
రాష్ట్రంలో 10,500లకుపైగా ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు, 1,500 ప్రైవేటు జూనియర్ కాలేజీలున్నాయి. కరోనా కేసులు తగ్గడంతో ఈ అకడమిక్ ఇయర్లో సెప్టెంబర్ 1 నుంచి ఫిజికల్ క్లాసులు మొదలయ్యాయి. ప్రస్తుతం మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. దీంతో గతంలో ఇచ్చిన షెడ్యూల్ కంటే ముందే స్కూళ్లు, కాలేజీలకు సర్కార్ ఈ నెల 8 నుంచి సంక్రాంతి సెలవులను ప్రకటించింది. ఈ క్రమంలో ఫీజుల వసూళ్ల దందాకు ప్రైవేటు మేనేజ్మెంట్లు రంగంలోకి దిగాయి. ఈ నెల 7 వరకు మొత్తం ఫీజులు వసూలు చేయాలని టార్గెట్లు పెట్టుకున్నాయి. ఒకవేళ కరోనా కేసులు పెరిగితే బడులు మూతపడే చాన్స్ ఉండటంతో, ఇప్పుడే ఫీజులు వసూలు చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి. సోమవారం సెలవుల ప్రకటన రాగానే, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలు స్టూడెంట్ల పేరెంట్స్కు ఫోన్లు, మెసేజ్లుచేసి ఫీజుల చెల్లించాలని కోరుతున్నాయి. మంగళవారం ప్రతి టీచర్కు ఒక్కో క్లాసును అప్పగించి, పేరెంట్స్కు కాల్స్ చేయించాయి. హాస్టళ్లలో ఉంటున్న స్టూడెంట్ల పేరెంట్స్కు ఫోన్ చేసి మొత్తం ఫీజులు చెల్లించాకే మీ పిల్లల్ని తీసుకుపోవాలని చెప్తున్నాయి. స్టూడెంట్లకు ఎగ్జామ్స్ పెడుతున్నామని, ఫీజులు కడితేనే రాయిస్తామని బెదిరిస్తున్నాయి. పేరెంట్స్ పదో తారీఖు వరకు కడ్తామని చెప్పినా వినిపించుకోవడం లేదు. ఫీజులు కట్టలేదనే కారణంతో చాలా స్కూళ్లు మంగళవారం జరిగిన ఎగ్జామ్స్కుపిల్లల్ని అనుమతించలేదు. కొన్ని స్కూళ్లు ఆన్లైన్ పాఠాల లింకుల నుంచి వారి పేర్లను తొలగించాయి. వసూళ్ల దందాకు పాల్పడుతున్న స్కూళ్లు, కాలేజీలపై చర్యలు తీసుకోవాలని పేరెంట్స్, స్టూడెంట్ల యూనియన్లు విద్యాశాఖ ఉన్నతాధికారులకు డిమాండ్ చేస్తున్నా పట్టించుకుంటలేదు.
ఫీజు కట్టలేదని ఎగ్జామ్ రాయనియ్యలె
మా పాప రామంతాపూర్ శ్రీచైతన్య స్కూల్లో 5వ తరగతి చదువుతోంది. సోమవారం నుంచి పరీక్షలు మొదలయ్యాయి. పెండింగ్ ఫీజు మొత్తం కట్టాలన్నారు. కనీసం రూ.10 వేలు కట్టాలి.. లేకుంటే పరీక్షలు రాయనివ్వమన్నారు. సోమవారం రూ.5 వేలు తీసుకొని స్కూలుకెళ్లి రిక్వెస్ట్ చేస్తే మిగతా 5 వేలు మంగళవారానికళ్లా చెల్లించాలని చెప్తూ ఎగ్జామ్కు పర్మిషన్ ఇచ్చారు. శాలరీ రాకపోవడంతో మిగతావి కట్టలేదు. దీంతో మంగళవారం పాపను ఎగ్జామ్ రాయించలేదు. ఫీజు కట్టకపోతే రేపటి నుంచి రావొద్దన్నారని మా పాప ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చింది.
- ఎంవీ రమణి, హబ్సీగూడ, హైదరాబాద్