ఉమ్మడి అదిలాబాద్ జిల్లా వార్తలు

ఉమ్మడి అదిలాబాద్ జిల్లా వార్తలు

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో శుక్రవారం పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఎనిమిది శాతం తేమతో క్వింటాలు పత్తికి రూ. 8,300 చెల్లించేందుకు వ్యాపారులు ముందుకు వచ్చారు. అనంతరం కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే జోగురామన్న, అడిషనల్ కలెక్టర్ నటరాజ్ పూజలు చేసి కొనుగోళ్లు ప్రారంభించారు. మొదట ఎడ్లబండిలో తీసుకొచ్చిన పత్తిని తూకం చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘాల లీడర్లు మాట్లాడుతూ తేమ శాతంతో సంబంధం లేకుండా కొనుగోళ్లు చేయాలని డిమాండ్​ చేశారు.  కలెక్టర్, ఎమ్మెల్యేతో రైతుల చర్చ అనంతరం మొదటి రోజు కాబట్టి వచ్చిన తేమ ఎంత ఉన్నా.. 12 శాతం లెక్క గట్టొ కొనాలని,  శనివారం నుంచి ఇది వర్తించదని ఆఫీసర్లు తెలిపారు. కార్యక్రమంలో వరంగల్ జేడీ మల్లేశం, ఏడీ అజ్మీర నాయక్, శ్రీనివాస్, రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు.  అయితే మద్దతు ధర గిట్టుబాటు కాదని.. వ్యాపారులు కావాలనే సిండికేట్ గా మారి ధరను తగ్గించారని రైతు సంఘాలు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొనుగోళ్ల వేళ.. మార్కెట్ వెలవెల..

పత్తి కొనుగోళ్ల ప్రారంభం రోజు పత్తి బండ్లతో కళకళలాడాల్సిన కాటన్ మార్కెట్ వెలవెలబోయింది. ఈ ఏడాది వర్షాల కారణంగా పంట దెబ్బతినడం.. ఆశించిన దిగుబడి రాక ఈ పరిస్థితి ఏర్పడిందని పలువురు పేర్కొంటున్నారు.

కుమ్రంభీం అడుగుజాడల్లో నడవాలి

ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఆదివాసీ హక్కుల కోసం పోరాడి అసువులు బాసిన వీరుడు కుమ్రంభీం అని, ప్రతీ ఒక్కరు ఆయన అడుగు జాడల్లో నడవాలని ఎంపీ సోయం బాపూరావు చెప్పారు. శుక్రవారం చించుఘాట్ లో నిర్వహించిన భీం వర్ధంతికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్​శంకర్​తో కలిసి ఆయన హాజరయ్యారు. కార్యక్రమంలో సౌత్ సెంట్రల్​ రైల్వే డీఆర్​యూసీసీ మెంబర్ జీవీ రమణ, లీడర్లు కంది శ్రీనివాస్ రెడ్డి, ముకుంద్, నందిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తాగడానికి పైసలియ్యలేదని తండ్రిని చంపిండు

దహెగాం,వెలుగు: లిక్కర్​తాగడానికి పైసలియ్యలేదని తండ్రిని చంపిండు. ఎస్సై సనత్​కుమార్​ కథనం ప్రకారం.. మండలంలోని ఖర్జి గ్రామానికి చెందిన కోసరి తిరుమలేశ్​గురువారం రాత్రి ఇంటికి వచ్చి మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని తండ్రి మధూకర్​(55)ను అడిగాడు. ఆయన ఇవ్వకపోవడంతో తిరుమలేశ్​పిడిగుద్దులతో తండ్రిపై దాడిచేశాడు. దీంతో మధూకర్​కిందపడి అక్కడిక్కడే మృతిచెందాడు. కేసు దర్యప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఘటనా స్థలాన్ని కాగజ్​నగర్​ రూరల్​ సీఐ నాగరాజు పరిశీలించారు.

ఎమ్మెల్యే రామన్న ఆరోపణలు సరికాదు

ఆదిలాబాద్​టౌన్,వెలుగు: ఆదిలాబాద్​ ఎమ్మెల్యే జోగు రామన్న తనపై చేసిన ఆరోపణలు సరికాదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్​ ఫైర్​అయ్యారు. శుక్రవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల్లో రామన్నకు తగ్గుతున్న ఆదరణను చూసి జీర్ణించుకోలేకనే తనపై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేకు వందల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయన్నారు. చనకా కొర్టా ప్రాజెక్టు అవినీతి చిట్టా విప్పుతానన్నారు. అవినీతిపై జైనథ్ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం సాక్షిగా తేల్చుకునేందుకు సిద్ధంకావాలన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్​రెడ్డి, లీడర్లు లాలా మున్న, దినేశ్​మాటోలియ, రత్నాకర్ రెడ్డి, వేద వ్యాస్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. 

ఆదివాసీలను ఎమ్మెల్యే పట్టించుకుంటలే

ఆదిలాబాద్ టౌన్,వెలుగు: నియోజకవర్గంలోని ఆదివాసీ గ్రామాల ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో ఎమ్మెల్యే జోగు రామన్న విఫలమయ్యారని జడ్పీ మాజీ చైర్​ పర్సన్​ సుహాసినీరెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆమె స్థానికంగా మీడియాతో మాట్లాడారు. ఆదిలాబాద్​ రూరల్ మండలంలోని ఆదివాసీ గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని గతనెలలో పాద యాత్ర చేసినట్లు గుర్తుచేశారు. కలెక్టర్​ సిక్తా పట్నాయక్​ను కలిసి పనులు చేయాలని కోరినట్లు తెలిపారు. సమావేశంలో లీడర్లు గందె విజయ్ కుమార్, గటిక క్రాంతి కుమార్, మోహన్ అగర్వాల్, సంతోష్ కొత్తపెల్లి, మశాల సర్పంచ్ చందర్ షా, కాంతారావు, సతీశ్​రెడ్డి, తోకల నరేశ్, లంక శ్రీను, గణేశ్, శివ కిరణ్ రెడ్డి, దుర్గాచారి తదితరులు పాల్గొన్నారు. 

మంత్రి, సీఐపై ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు

నిర్మల్,వెలుగు: దళితులను మానసికంగా వేధించి, అక్రమ కేసులు బనాయించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, నర్సాపూర్ ఎస్సై గీత, రూరల్ సీఐ వెంకటేశ్ పై  విచారణ చేయాలని బీజేపీ లీడర్లు కోరారు. శుక్రవారం జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ డైరెక్టర్ డాక్టర్ జి. సునీల్, రాష్ట్ర మానవహక్కుల కమిషన్​చైర్​పర్సన్​జస్టిస్ గుండా చంద్రయ్యకు  ఫిర్యాదు  చేశారు. అర్హులైన వారికి దళిత బంధు ఎందుకు మంజూరు చేయలేదని కోరినందుకు మంత్రి, పోలీసు ఆఫీసర్లు కేసులు బనాయించారని పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో లీడర్లు డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి, కొలిపెల్లి శ్రావణ్ రెడ్డి, మురళీధర్, బరుకుంట నరేందర్, మిట్టపల్లి రాజేందర్ తదితరులు ఉన్నారు.

ముగ్గురికి సర్వేపల్లి రాధాకృష్ణన్ అవార్డులు

మంచిర్యాల,వెలుగు: విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న జిల్లా ట్రస్మా అధ్యక్షుడు రాపోలు విష్ణువర్ధన్ రావు, ప్రధాన కార్యదర్శి ఏనుగు శ్రీకాంత్ రెడ్డి,  ట్రెజరర్​ సురభి శరత్ కుమార్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్​ అవార్డు దక్కింది. శుక్రవారం హైదరాబాద్​లోని పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ ప్రాంగణంలో శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్​అలీ, మాజీ స్పీకర్​ మధుసూదనాచారి అవార్డులు అందజేశారు. కరోనా టైంలో ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి అండగా నిలవడం, విద్యారంగానికి అందిస్తున్న సేవలను గుర్తించి అవార్డులు అందజేసినట్లు రామానుజన్ ఫౌండేషన్ బాధ్యులు తెలిపారు. 

బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడిగా కమ్మల స్వామి

కడెం,వెలుగు: జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షుడిగా కడెం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన కమల స్వామిని నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు ఒడిసెల అర్జున్ తెలిపారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన జిల్లా నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్థాయి నుంచి బీజేపీని బలోపేతం చేసేందుకు తనవంతు కృషిచేస్తానన్నారు. 

కేంద్రం నిధులనతో ఎస్సీల అభివృద్ధి

నిర్మల్,వెలుగు: సెంట్రల్​గవర్నమెంట్ ​ఫండ్స్​తోనే రాష్ట్రంలో ఎస్సీ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి తెలిపారు. శుక్రవారం ఆమె పార్టీ లీడర్లతో కలిసి బస్తీ సంపర్క్​ అభియాన్ పోస్టర్​ రిలీజ్​ చేశారు. వచ్చేనెల 26 వరకు బస్తీ సంపర్క్ అభియాన్ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. హైదరాబాద్​లోని ట్యాంక్​ బండ్​పై ఇప్పటి వరకు అంబేద్కర్​ విగ్రహం లేదన్నారు. కార్యక్రమంలో దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు రాచకొండ సాగర్, ప్రధాన కార్యదర్శి మెడిసిమ్మ రాజు, సామ రాజేశ్వర్ రెడ్డి, దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్, లీడర్లు ఒడిసెల శ్రీనివాస్, గుంజాల రామానుజన్, సాదం అర్వింద్, అల్లం భాస్కర్, తోడ సత్యనారాయణ, కుంచపు పోశెట్టి, అల్లం లహరి తదితరులు పాల్గొన్నారు.

విశాక ట్రస్ట్ ఆధ్వర్యంలో బెంచీలు అందజేత

జైపూర్(భీమారం), వెలుగు: 'కాకా' వెంకటస్వామి ఫౌండేషన్, విశాక చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని బూరుగుపల్లి గవర్నమెంట్​స్కూల్​కు 30 బెంచీలు అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు వేల్పుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ భరత్ రెడ్డి, కిసాన్ మోర్చా లీడర్లు రాజిరెడ్డి , కంకణాల సుధాకర్ రెడ్డి, కోట రాజేశ్, సెగ్గం మల్లేశ్, బూత్ అధ్యక్షుడు అవిడపు సురేశ్, వార్డు మెంబర్​పోర్తిక పద్మ -రాములు తదితరులు పాల్గొన్నారు.

రెండు రోజుల్లో ఫుల్ స్టెంత్​ ఉండాలి

కాగ జ్ నగర్,వెలుగు: ‘దసరా సెలవులు ముగిసి నాలుగు రోజులైంది. అయినా 20 శాతం పిల్లల హాజరు లేకుంటే టీచరు ఏం చేస్తున్నారు’ అని అడిషనల్ కలెక్టర్ చాహత్​బాజ్ పాయ్ ఫైర్​అయ్యారు. శుక్రవారం 'స్కూళ్లకు తాళాలు తీయలేదు' శీర్షికన 'వెలుగు'లో ప్రచురితమైన కథనానికి ఆమె స్పందించారు. బాబాపూర్​బాలికల ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. స్టూడెంట్స్​హాజరు పరిశీలించారు. రెండు రోజుల్లో ఫుల్​స్ట్రెంత్​ఉండాలని  హెచ్ఎం తిరుపతిని ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. మెనూలో గుడ్లు ఎందుకు పెట్టలేదని సిబ్బందిని ప్రశ్నించారు. గుడ్లు, పాలు, కూరగాయలు, ఇతర దినుసులు సప్లై చేయలేదని హెచ్ఎం తెలపడంతో ఈ విషయం డిప్యూటీ డైరెక్టర్​కు ఎందుకు చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లల భోజనం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే బాధపడాల్సి వస్తుందన్నారు.  

వంతెన కోసం వాగులో నిలబడి నిరసన 

భైంసా,వెలుగు: వంతెన నిర్మించాలని కోరుతూ కోతుల్​గాం ​రైతులు శుక్రవారం వాగులో నిలబడి నిరసన వ్యక్తం చేశారు. వాగు అవతలి వైపు ఉన్న పొలాలకు వెళ్లాలంటే ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో వాగు దాటలేకపోతున్నామన్నారు. వంతెన నిర్మించాలని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఆఫీసర్లకు విన్నవించినా.. పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా స్పందించి బ్రిడ్జి నిర్మించాలని కోరారు. లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసనలో రైతులు లక్ష్మణ్, దావు, మణులబాయి, రాజన్న, చంద్రశేఖర్ రెడ్డి, నక్కల సురేశ్, పిరాజి, శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు.

ఆర్ఎంవోకు సన్మానం

ఖానాపూర్,వెలుగు: నిర్మల్ గవర్నమెంట్​హాస్పిటల్​ఆర్ఎంవో  వేణుగోపాల కృష్ణను శుక్రవారం సూర్జాపూర్  లక్ష్మీవెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు, మాజీ జడ్పీటీసీ రాథోడ్ రామునాయక్ మాట్లాడుతూ వేణుగోపాల కృష్ణ ఉత్తమ కవి, ఉత్తమ రక్త దాతగా  ప్రభుత్వం నుంచి అవార్డు పొందినందుకు సన్మానించినట్లు తెలిపారు. కార్యక్రమంలో లీడర్లు వెంకట్ రావు, నరేందర్, రాము, మాజీ సర్పంచ్ మల్లవ్వ తదితరులు ఉన్నారు.

నాణ్యమైన విద్య అందించాలి

ఆదిలాబాద్,వెలుగు: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ఎమ్మెల్యే జోగు రామన్న చెప్పారు. శుక్రవారం మావల మండల కేంద్రంలో బేలకు చెందిన మహాత్మ జ్యోతిబాపులే బాలురు గురుకుల పాఠశాలను ప్రారంభించారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ బీసీల గణనపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్​ను సందర్శించారు. డాక్టర్ల నియామకాలు, తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, డీఈవో ప్రణీత, గ్రంథాలయ చైర్మన్ రౌత్ మనోహర్, జడ్పీటీసీ నల్ల వనిత రాజేశ్వర్, సర్పంచ్ ప్రమీల, గురుకులాల ఆర్సీవో గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు. 

రూ. 50 లక్షలతో వంటగది

నిర్మల్,వెలుగు: స్థానిక మల్లన్న గుట్టపై  గల హరిహర క్షేత్రంలో కిచెన్, డైనింగ్ హాల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రూ.50 లక్షలతో చేపడుతున్న ఈ పనులను శుక్రవారం ఆలయ ధర్మకర్త అల్లోల మురళీధర్ రెడ్డి, అల్లోల తిరుపతిరెడ్డి, గురుస్వామి మూర్తి, సభ్యులు వేణుగోపాల్ రెడ్డి పరిశీలించారు. పనులు త్వరగా పూర్తిచేయాలని 
ఆదేశించారు.

12 వేల మందికి ఫ్రీగా ట్రైనింగ్ ​ఇచ్చాం

మందమర్రి,వెలుగు: మందమర్రి ఏరియా పరిధిలో 12 వేల మంది కార్మికుల పిల్లలు, పరిసరాల ప్రాంతాల యువతకు సింగరేణి ఆధ్వర్యంలో వివిధ వృత్తి కోర్సులపై ఫ్రీగా ట్రైనింగ్​ఇచ్చామని ఏరియా సింగరేణి జీఎం చింతల శ్రీనివాస్​తెలిపారు. శుక్రవారం మందమర్రిలో సింగరేణి సేవా సమితి సెంటర్​లో టైలరింగ్, మగ్గం వర్క్, ఫ్యాషన్​ డిజైనింగ్, బ్యూటీషియన్ కోర్సుల శిక్షణను జీఎం చింతల శ్రీనివాస్- లక్ష్మి దంపతులు ప్రారంభించారు. 22 ఏళ్లుగా ఉపాధి  కోర్సులపై ఇస్తున్న శిక్షణను మహిళలు, యువత  సద్వినియోగం చేసుకొని ఉపాధి పొందుతున్నారన్నారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్​ వైస్​ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్, ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీ సలెంద్ర సత్యనారాయణ, డీవైపీఎం శ్యాంసుందర్, సీనియర్​ పీవో మైత్రేయబంధు, సేవ, కమ్యూనికేషన్ సెల్​ కోఆర్డినేటర్లు నెల్సన్, తుమ్మల సంపత్​ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ హయాంలో దేశం అభివృద్ధి

భైంసా,వెలుగు: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధిలో దూసుకుపోతోందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్​రావు పటేల్​ చెప్పారు. శుక్రవారం ఆయన తానూర్ మండలంలో పర్యటించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. రాష్ట్రంలోని టీఆర్ఎస్​ప్రభుత్వం అవలంబిభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు ప్రజలు గమనిస్తున్నారన్నారు. ముథోల్​ నియోజకవర్గంలో సమస్యలు రాజ్యమేలుతున్నాయని ఆరోపించారు. అనంతరం వడ్​గాంలో మృతి చెందిన సంతోష్​ కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన వెంట లీడర్లు నరేశ్, సాయినాథ్, గణేశ్, చక్రధర్, నాగనాథ్, గురుజీ, లక్ష్మణ్, సూరజ్, రమేశ్, పోశెట్టి తదితరులు ఉన్నారు.