మున్సిపల్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత
నిర్మల్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ అవిశ్వాస తీర్మాణంపై హైకోర్టు స్టే విధించింది. ఇవాళ అవిశ్వాస ఓటింగ్ సమావేశానికి ఆర్డీఓ రత్న కల్యాణి, నోటీస్ ఇచ్చిన కౌన్సిలర్లు హాజరయ్యారు. అయితే స్టే కారణంగా ఓటింగ్ సమావేశం రద్దు చేస్తున్నట్లు ఆర్డీఓ ప్రకటించారు. దీంతో ఆర్డీఓను అసమ్మతి కౌన్సిలర్లు అడ్డుకున్నారు. అవిశ్వాసం పై ఓటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
దీంతో మున్సిపల్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత వాతావారణం నెలకొంది. ఈ సందర్భంగా అసమ్మతి కౌన్సిలర్లు మాట్లాడుతూ కోర్టు తీర్పును తాము గౌరవిస్తామన్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ ల పై న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, వైస్ చైర్మన్ అబ్దుల్ ఖలీల్ పై 12 మందిలో 9 మంది కౌన్సిలర్లు అవిశ్వాస నోటీస్ ఇచ్చిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఈ వ్యవహారం వాయిదా పడింది. చైర్మన్, వైస్ చైర్మన్ లు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారైనప్పటికీ సొంత పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రకటించారు.