సికింద్రాబాద్, వెలుగు: తాకట్టు నగలు విడిపించి తెచ్చి ఎక్కువ లోన్ తీసుకుంటామని ఫైనాన్స్ కంపెనీని నమ్మించి రూ.14లక్షలు తీసుకుని మాయమైన దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. మల్కాజిగిరి పోలీసులు తెలిపిన ప్రకారం.. మల్కాజిగిరికి చెందిన దాసరి శ్యామ్కుమార్, రజనీ దంపతులు 10 రోజుల కిందట ఆనంద్బాగ్లోని కేఎల్ఎం యాక్సివా ఫైనాన్స్కంపెనీకి వెళ్లి బ్రాంచ్మేనేజర్లావణ్యను కలిశారు. తమ 382 గ్రాముల బంగారు నగలు ఓరో ఫైనాన్స్ కంపెనీలో తాకట్టులో ఉన్నాయని చెప్పి, వాటిని విడిపించేందుకు రూ. 14. 85 లక్షలు కట్టాల్సి ఉందని తెలిపారు. ఆ డబ్బు ఇస్తే నగలు విడిపించి మీ బ్రాంచ్ లో తాకట్టుపెట్టి ఎక్కువ డబ్బులు తీసుకుంటామని మేనేజర్ లావణ్యను నమ్మించారు.
దీంతో ఆమె లోన్ప్రాసెస్పూర్తి చేసి దంపతులు అడిగిన డబ్బు ఇచ్చింది. నగలు తేవాలని బ్రాంచ్కు చెందిన ఉద్యోగిని దంపతుల వెంట పంపించింది. ఓరో ఫైనాన్స్ కంపెనీ కి వెళ్లిన దంపతులు తమ వెంట వచ్చిన వ్యక్తిని బయట ఉంచి లోపలికి వెళ్లి మేనేజర్తో మాట్లాడారు. లోన్ ప్రాసెస్పూర్తి చేసి నగలు ఇచ్చేస్తామని ఓరో కంపెనీ మేనేజర్ ఒకరోజు టైమ్ అడిగారని లావణ్యకు ఫోన్చేసి చెప్పారు. మరుసటి రోజు దంపతులకు లావణ్య ఫోన్చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది.
దీంతో భయాందోళన చెందిన ఆమె ఓరో ఫైనాన్స్నిర్వాహకులకు ఫోన్ చేసి దంపతుల ఆచూకీ కోసం ప్రయత్నించగా లభించలేదు. కేఎల్ఎం ఆక్సివా ఫైనాన్స్కంపెనీ రీజినల్ మేనేజర్ సిద్దంశెట్టి ప్రవీణ్కుమార్ ఫిర్యాదుతో మల్కాజిగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు దాసరి శ్యామ్ కుమార్, రజనీ దంపతులను అరెస్ట్ చేశారు.