కోర్టు భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

కోర్టు భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

కోదాడ, వెలుగు : నూతన కోర్టు భవన నిర్మాణ పనులను వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని కోదాడ బార్ అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. కోదాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతిని పలువురు న్యాయవాదులు కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోదాడలో మొత్తం 4 కోర్టులు పనిచేస్తున్నాయని తెలిపారు.

5 కోర్టుల భవన నిర్మాణానికి గత ఫిబ్రవరి22న శంకుస్థాపన జరిగిందని, ఆ పనులు మాత్రం ఇంకా ప్రారంభంకాలేదని వారి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత నిర్మాణ పనులు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అనంతరం మంత్రిని వారు సన్మానించారు. మంత్రిని కలిసినవారిలో సీనియర్ న్యాయవాదులు చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, మేకల వెంకట్రావు, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చింతకుంట్ల రామిరెడ్డి, న్యాయవాదులు ఉన్నారు.