- నిలోఫర్లో ఒక డాక్టర్కు వైరస్
- వరంగల్ కేఎంసీలో 41 మందికి..
- ప్రైవేట్ హాస్పిటల్స్లోనూ భారీగానే కేసులు
- చాలా మంది మెడికల్ స్టాఫ్ టెస్టుల రిజల్ట్స్ పెండింగ్
- గతంలో పీపీఈ కిట్లు వేసుకొని ట్రీట్మెంట్
- ఇప్పుడు క్యాజువల్గా పేషెంట్లను చూస్తున్నరు
- అందుకే వేగంగా సోకుతున్న వైరస్
హైదరాబాద్, వరంగల్ సిటీ, వెలుగు: థర్డ్ వేవ్లో పెద్ద సంఖ్యలో డాక్టర్లు కరోనా బారిన పడుతున్నారు. గాంధీ, ఉస్మానియా హాస్పిటల్స్లో 84 మంది డాక్టర్లకు వైరస్ సోకింది. నిలోఫర్లో ఒక డాక్టర్కు పాజిటివ్ వచ్చింది. ప్రైవేటు హాస్పిటళ్లలో కూడా భారీ సంఖ్యలో డాక్టర్లు, మెడికల్ సిబ్బంది వైరస్ బారిన పడుతున్నారు. కేర్ హాస్పిటల్లో నలుగురు జనరల్, అడ్మిస్ట్రేషన్ సిబ్బందికి వైరస్ సోకినట్లు తెలుస్తోంది. మెడికవర్లో కూడా కొందరికి కరోనా సోకినట్లు హాస్పిటల్ డాక్టర్లు చెబుతున్నారు. గాంధీ, ఉస్మానియాకు చెందిన అనేక మంది డాక్టర్లు మంగళవారం కూడా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకున్నారు. వీళ్లలోనూ పెద్ద సంఖ్యలోనే పాజిటివ్ కేసులు ఉండొచ్చని సమాచారం.
గాంధీ ఆసుపత్రిలో సోమవారం సాయంత్రం వరకు 28 మంది డాక్టర్లు, స్టూడెంట్లకు కరోనా సోకింది. ఈ సంఖ్య మంగళవారం 44కు చేరింది. గాంధీలోని 20 మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్, 10 మంది హౌస్ సర్జన్లు, 10 మంది పీజీ వైద్యులు, నలుగురు ఫ్యాకల్టీ.. మొత్తం 44 మంది వైరస్ బారిన పడ్డారు. అయితే ఈ విషయం తన దృష్టికి రాలేదని, కొంతమంది మాత్రమే కరోనా బారిన పడినట్లు తెలిసిందని ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు అన్నారు. గాంధీలోని మెడికల్, నాన్ మెడికల్ సిబ్బంది కరోనా రూల్స్ పాటించాలని స్పష్టం చేశారు. ఉస్మానియా హాస్పిటల్లో మంగళవారం 79 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 19 మంది ఎంబీబీఎస్ స్టూడెంట్లు, 35 మంది హౌస్ సర్జన్లు, 23 మంది పీజీలు, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. వీరంతా ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్లో ఉన్నారని హాస్పిటల్ సూపరిండెంటెంట్ నాగేందర్ తెలిపారు. నిలోఫర్లో ఒక డాక్టర్ హోమ్ క్వారంటైన్ లో ఉన్నట్లు హాస్పిటల్ ఆర్ఎంఓ జ్యోతి చెప్పారు. పాజిటివ్ వచ్చిన డాక్టర్లు, నర్సులు, మెడికల్ స్టాఫ్ శాంపిల్స్ను జీనోమ్ సీక్వెన్సింగ్కి పంపారు. వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీ ( కేఎంసీ)లో ప్రిన్సిపాల్ మోహన్ దాస్తోపాటు 40 మంది స్టూడెంట్లు కరోనా బారిన పడ్డారు. 2 రోజుల క్రితం 26 మందికి పాజిటివ్ రాగా.. మంగళవారం మరో 15 మందికి వైరస్ సోకింది.
ప్రైవేట్లోనూ భారీగానే..
ప్రైవేట్ హాస్పిటల్స్లోనూ కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. 2 రోజుల కింద కేర్ హాస్పిటల్స్ లోని అడ్మిస్ట్రేషన్, జనరల్ స్టాఫ్లో నలుగురికి పాజిటివ్ గా తేలింది. మెడికవర్ హాస్పిటల్ లోనూ కొంతమంది డాక్టర్లు, సిబ్బంది కరోనా బారిన పడ్డారు. డాక్టర్లు, మెడికల్ స్టాఫ్ రెండు, మూడు మాస్కులు పెట్టుకుంటున్నా వైరస్ బారిన పడుతున్నారని, ఎందుకు అలా జరుగుతుందో తెలియడంలేదని హాస్పిటల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ రాకేశ్ తెలిపారు. కరోనా వార్డుల్లో డ్యూటీకి వెళ్లే డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది తప్పనిసరిగా పీపీఈ కిట్ వేసుకునే వెళ్తున్నారని అన్నారు.
అజాగ్రత్తే కారణమా?
ఒమిక్రాన్ వేరియంట్ తేలికపాటిదేనని, వైరస్ సోకినా పెద్దగా ఎఫెక్ట్ ఉండట్లేదని మొదట్లో ప్రచారం జరిగింది. దీంతో డాక్టర్లు, హెల్త్ సిబ్బందిలో అజాగ్రత్త పెరిగింది. ఫస్ట్, సెకండ్ వేవ్ లలో పీపీఈ కిట్లు వేసుకుని డ్యూటీలు చేసిన డాక్టర్లు, నర్సులు.. ఇప్పుడు కేసుల సంఖ్య పెరుగుతున్నా కేవలం మాస్క్ లు వేసుకునే ట్రీట్మెంట్ అందిస్తున్నారు. టెస్ట్లు, ట్రీట్మెంట్ కోసం వచ్చే పేషెంట్లకు కేవలం మాస్క్ ధరించే చికిత్స చేస్తున్నారు. ఈ కారణంగానే చాలా మంది వైరస్ బారిన పడుతున్నారని పలువురు హెల్త్ ఎక్స్పర్టులు చెబుతున్నారు.