- మహారాష్ట్రలోని మహడ్లో సంఘటన
- మూడు నెలల పాటు నాలుగు ఆపరేషన్లు
- వారంలో డిశ్చార్జ్ చేస్తామన్న డాక్టర్లు
ముంబై: అది మహారాష్ట్రలోని మహడ్ ఏరియా. ఓ పదేండ్ల పిల్లాడికి ఉన్నట్టుండి కడుపులో నొప్పి స్టార్టయింది. తల్లిదండ్రులు దగ్గర్లోని హాస్పిటల్కు తీసుకెళ్లారు. డాక్టర్లు చెక్ చేశారు. చిన్న పేగులో పుండు ఉందని గుర్తించారు. పిల్లాడికి ఇంతకుముందే కరోనా వచ్చి పోయిందని, ఆ మహమ్మారి చిన్న పేగుపై తీవ్రమైన ప్రభావం చూపడంతో పుండు ఏర్పడిందని తెలుసుకున్నారు. ఆ భాగాన్ని తొలగించి మరో పేగు అమర్చాలన్నారు. ఆ పేగును తండ్రి ఇచ్చాడు. 3 నెలలు, 4 హాస్పిటళ్లు మార్చి చివరికి విజయవంతంగా ట్రీట్మెంట్ పూర్తి చేశారు. ఆ 3 నెలలు మెడ భాగం నుంచి లిక్విడ్ ఫుడ్నే పిల్లాడు తీసుకున్నాడు. ఏమైతేనేం మరో వారంలో డిశ్చార్ కాబోతున్నాడు. నార్మల్ లైఫ్ జీవించబోతున్నాడు.
ఇన్ఫెక్షన్ సోకిన భాగాన్ని తీసేయాలన్న డాక్టర్లు
మహారాష్ట్రలోని మహడ్లో సంతోష్ దంపతులకు ఓం ఘులే అనే పిల్లాడున్నాడు. ఆగస్టులో అతడికి కడుపు నొప్పి మొదలవడంతో తల్లిదండ్రులు మహడ్లోని హాస్పిటల్కు తీసుకెళ్లారు. డాక్టర్లు చెక్ చేసి చిన్న పేగులో పుండు ఉందని గుర్తించారు. పుండు వల్ల రక్తం గడ్డ కట్టుకుపోయి ఇన్ఫెక్షన్ ఏర్పడిందన్నారు. ఓమ్కు లక్షణాల్లేకుండానే ఇదివరకు కరోనా వచ్చి పోయిందని, దాని వల్లే పేగులో కణాలు దెబ్బతిని ఇన్ఫెక్షన్ ఏర్పడిందని చెప్పారు. ఆ ఇన్ఫెక్షన్ సోకిన భాగాన్ని తొలగించాలని, దాన్ని ఇవ్వడానికి ఎవరైనా డోనర్ కావాలని అన్నారు. తండ్రి తానిస్తానని ముందుకొచ్చాడు. అతని నుంచి 200 సెంటీమీటర్ల చిన్న పేగును డాక్టర్లు సేకరించారు.
15 ఏండ్ల లోపు పిల్లల్లోనూ కరోనా ఎఫెక్ట్స్
నవంబర్ నాలుగున 4వ ఆపరేషన్ చేయగా మూడు వారాల తర్వాత కోలుకున్న పిల్లాడు మూడు నెలల తర్వాత తొలిసారి మళ్లీ పప్పన్నం తిన్నాడు. పిల్లాడు నార్మల్గా బతకగలడని, అయితే కొన్ని ఇమ్యునో సప్రెసెంట్ డ్రగ్స్ తీసుకోవాల్సి ఉంటుందని డాక్టర్లు చెప్పారు. ఓమ్ను వారంలో డిశ్చార్జ్ చేస్తామన్నారు. బతికున్న వ్యక్తి మరో వ్యక్తికి చిన్న పేగు దానం చేసి సక్సెస్ అవడం ఇది ప్రపంచంలోనే తొలిసారని డాక్టర్లు వివరించారు. ఓమ్ లాంటి కేసు ఇంతకుముందు ఇటలీలో వచ్చినా ఆ పేషెంట్చనిపోయారన్నారు. ఓమ్ కేసును బట్టే కొవిడ్ వైరస్ ఎంత డేంజరో, ఎంతలా ఇబ్బంది పెడుతుందో తెలుస్తోందన్నారు. 15 ఏండ్ల లోపు పిల్లల్లోనూ పోస్ట్ కొవిడ్ సమస్యలు వస్తున్నాయని అర్థమవుతోందని చెప్పారు. బతికున్న వాళ్లు ఈజీగా 40 శాతం పేగును డొనేట్ చేయొచ్చని, మిగిలిన పెగుతో నార్మల్గా తిండి డైజెస్ట్ అవుతుందని డాక్టర్లు చెబుతున్నారు.
మెడ నుంచి ఫుడ్
తండ్రి నుంచి చిన్న పేగును తీసుకున్న డాక్టర్లు.. మూడు నెలల పాటు థానే, పుణే, మహడ్ హాస్పిటళ్లలో ఆపరేషన్లు చేశారు. ట్రాన్స్ప్లాంటేషన్తో ఇన్ఫెక్షన్ క్లీనింగ్ కూడా చేయాల్సి వచ్చింది. ఇన్ని నెలల పాటు పిల్లాడికి మెడలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన భాగాల ద్వారా ఫుడ్ అందించామని డాక్టర్లు చెప్పారు. తండ్రి నుంచి పేగును తీయడానికి 5 గంటలు, పిల్లాడికి అమర్చడానికి 10 గంటలు కష్టపడ్డామని తెలిపారు. అన్ని నెలల పాటు పేరంటల్ ఫుడ్ పెట్టడం వల్ల పిల్లాడి లివర్ పని చేయడం కొంత వరకు దెబ్బతిందని తెలిపారు.