ఉమ్మడిగా మాన్సూన్​ యాక్షన్ ​ప్లాన్..అన్ని శాఖల అధికారులతో సీపీ మీటింగ్​

ఉమ్మడిగా మాన్సూన్​ యాక్షన్ ​ప్లాన్..అన్ని శాఖల అధికారులతో సీపీ మీటింగ్​

హైదరాబాద్​ సిటీ, వెలుగు: గ్రేటర్​లో వర్షాకాలం సన్నద్ధతపై అన్ని శాఖల ఉన్నతాధికారులతో సీపీ సీవీ ఆనంద్ మీటింగ్ నిర్వహించారు. బంజారాహిల్స్‌‌‌‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లో జరిగిన ఈ మీటింగ్​కు జీహెచ్‌‌‌‌ఎంసీ, హైడ్రా, అగ్నిమాపక, విద్యుత్, వైద్యారోగ్య శాఖ, ఐఎండీ, ఎస్‌‌‌‌డీఆర్‌‌‌‌ఎఫ్, వాటర్​బోర్డ్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల నుంచి ఉన్నతాధికారులు హాజరయ్యారు. వర్షాకాలంలో ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

ముఖ్యంగా బల్దియా పరిధిలో గుర్తించిన 141 వాటర్​లాగింగ్​ప్రాంతాల్లో వరద పర్యవేక్షణ , ట్రాఫిక్ నిర్వహణపై చర్చించారు. భారీ వర్షాల సమయంలో కరెంట్​సరఫరా పునరుద్ధరించడం, వరదను నాలాలకు మళ్లించడం, వ్యాధుల నివారణ, శిథిలావస్థ నిర్మాణాల గుర్తింపు వంటిపై అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అత్యవసర సాయం కోసం ఆపద మిత్ర వాలంటీర్లు, ఎన్‌‌‌‌జీఓలను ఏర్పాటు చేయాలని, ప్రజల భద్రత కోసం సాచెట్ మొబైల్ అప్లికేషన్, ఇతర ప్రభుత్వ సేవల వాడకాన్ని ప్రోత్సహించాలని డిసైడ్​అయ్యారు. 

 అధికారులను నామినేట్ చేయండి: కమలాసన్​రెడ్డి 

కమాండ్​కంట్రోల్​సెంటర్​డైరెక్టర్​కమలాసన్​రెడ్డి మాట్లాడుతూ.. మాన్సూన్​జాయింట్ యాక్షన్ టీమ్  ను ఏర్పాటు చేయడానికి అధికారులను నామినేట్ చేయాలని కోరారు. విపత్తు, అత్యవసర పరిస్థితుల్లో కమాండ్​కంట్రోల్​సెంటర్​అధునాతన సౌకర్యాలు, కమ్యూనికేషన్ వ్యవస్థను ఉపయోగించుకోవాలన్నారు. ఫైర్​సేఫ్టీ డిపార్ట్​మెంట్​ డీజీ నాగి రెడ్డి మాట్లాడుతూ.. కమాండ్ కంట్రోల్ సెంటర్ ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. హైడ్రా కమిషనర్​రంగనాథ్, కలెక్టరేట్​ఆఫీసర్​ముకుంద రావు, విద్యుత్ శాఖాధికారి ఎన్. నర్సింహులు, జీహెచ్‌‌‌‌ఎంసీ ఆఫీసర్​సహదేవ్ రత్నాకర్ , సైబరాబాద్ జాయింట్ సీపీ గజారావు భూపాల్ పాల్గొన్నారు.