
నిజామాబాద్, వెలుగు: నగరంలోని సఖి సెంటర్ను మంగళవారం సీపీ సాయిచైతన్య విజిట్ చేసి అక్కడ ఆశ్రయం పొందుతున్న బాధిత మహిళలతో మాట్లాడారు. గృహహింసతో పాటు ఆయా కారణాలతో మోసపోయిన బాధితులు స్వశక్తిపై నిలదొక్కుకునే వరకు ఇక్కడే ఉండే వీలుందని తెలిపారు. గవర్నమెంట్ అందిస్తున్న సౌకర్యాలు వినియోగించుకోవాలన్నారు. సెంటర్ రికార్డులు చెక్ చేసిన ఆయన బాధితులకు అండగా ఉండాలన్నారు.
సఖి సెంటర్తో పాటు భరోసా, ఐసీడీఎస్ ఆఫీస్ ఒకే చోట ఉంటే బాగుంటుందని ఆయన జిల్లా ఆఫీసర్ రసూల్బీకి సూచించారు. స్నేహ సొసైటీ ఫౌండర్ సిద్దయ్య, సూదం లక్ష్మీ, భానుశ్రీ తదితరులు ఉన్నారు. అంతకు ముందు సీపీ సాయి చైతన్య రెంజల్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ విజయ్బాబు, ఎస్సై చంద్రమోహన్ తదితరులు ఉన్నారు.
13 మంది వీడీసీ సభ్యులకు ఐదేండ్ల జైలు
నిజామాబాద్, వెలుగు : జక్రాన్పల్లి మండలం మునిపల్లి విలేజ్కు చెందిన తుమ్మ రవీందర్ అతడి కుటుంబాన్ని బహిష్కరించిన 13 మంది వీడీసీ సభ్యులకు మంగళవారం కోర్టు ఐదేండ్ల జైలు శిక్ష విధించిందని సీపీ తెలిపారు. 2021లో విలేజ్లో ఒక రోడ్డు నిర్మాణానికి అడ్డుపడుతున్నాడని రవీందర్ కుటుంబాన్ని బహిష్కరించగా ఎస్సీ, ఎస్టీ యాక్టు కింద కేసు నమోదు చేశామన్నారు. నేరం రుజువు కావడంతో వారికి ఐదేండ్ల జైలు శిక్ష పడిందన్నారు.
కారు దిగి వృద్ధురాలి చెంతకు సీపీ..
మంగళవారం సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్న సీపీ సాయిచైతన్య గాయాల కట్టుతో తనను కలువడానికి వచ్చిన వృద్ధురాలు ఆమె కూతురిని చూసి కారు దిగారు. పాత కక్షలతో బంధువులు తనపై తన కూతురిపై దాడి చేసి గాయపర్చారని ఆర్మూర్ టౌన్కు చెందిన యాదమ్మ అనే వృద్ధురాలు సీపీకి తెలుపగా ఆయన అక్కడి నుంచి ఎస్సైకి ఫోన్ చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు.