
హైదరాబాద్,వెలుగు : న్యూ ఇయర్ వేడుకలను టార్గెట్గా చేసుకుని ఓపియం(నల్లమందు)సప్లై చేసే రాజస్థాన్ ముఠాను మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద రూ.56 లక్షలు విలువైన 3.5 కిలోల ఓపియం,45 గ్రాముల గసగసాల పౌడర్(పొప్పి స్ట్రా),రూ.2.8లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ సీపీ సుధీర్బాబు మీడియాకు వివరాలు వెల్లడించారు. రాజస్థాన్ లోని జోధ్పూర్కు చెందిన శశిపాల్ బిష్నయ్(31), మదన్లాల్ బిష్నయ్(36) సిటీకి వచ్చి మేడ్చల్ జిల్లా కొంపల్లి పరిధి ఏఎస్ రావు నగర్లో సెంట్రింగ్ వర్కర్లుగా పని చేస్తున్నారు.
సిటీలో న్యూఇయర్ వేడుకల్లో భాగంగా కస్టమర్లకు నల్లమందు సప్లై చేసేందుకు ప్లాన్ చేశారు. రాజస్థాన్ నుంచి హైదరాబాద్కు ప్రైవేట్ ట్రావెల్స్లో నల్లమందును తీసుకొచ్చారు. సమాచారం తెలియడంతో మల్కాజిగిరి పోలీసులు నిఘా పెట్టారు. సోమవారం ఉదయం కుషాయిగూడలో చెకింగ్ చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ట్రావెల్ బ్యాగ్లో తరలిస్తున్న నల్లమందు, గసగసాల పౌడర్ను పోలీసులు సీజ్ చేశారు.