కేసీఆర్ మోడీకి జై కొడితే..రాత్రికిరాత్రే కేసులన్నీ మాయం: నారాయణ

కేసీఆర్ మోడీకి జై కొడితే..రాత్రికిరాత్రే కేసులన్నీ మాయం: నారాయణ

తెలంగాణలో టీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది కాబట్టే ఆ పార్టీపై కేంద్రం దాడులు చేయిస్తోందని  సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ  అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించే రాష్ట్ర ప్రభుత్వాలు, పార్టీలు, వ్యక్తులపై కేంద్రం ఏకపక్ష దాడులు జరుపుతోందన్నారు. ఒకవేళ కేసీఆర్ మోడీకి జై కొడితే.. రాత్రికి రాత్రే కేసులన్నీ మాయమైపోతాయని అన్నారు.  తృణమూల్ కాంగ్రెస్‌లో శారద, నారద కేసుల్లో ఉన్నవాళ్లు బీజేపీలో చేరగానే ఏమైందో తెలుసు కదా అని అన్నారు.

జీ-20కి  భారత నాయకత్వాన్ని సీపీఐ కూడా స్వాగతిస్తుందని నారాయణ అన్నారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే మహిళా సాధికారత బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు.  మహిళా సాధికారత బిల్లును ఆమోదించకుండా జీ-20లో మహిళా సాధికారతపై ఏం చర్చిస్తారని ప్రశ్నించారు. మహిళా సాధికారిత బిల్లు ఆమోదానికి సీపీఐ పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. జీ-20లో పుష్పం గుర్తును లోగోగా పెట్టారని.. ఇది సంకుచిత స్వభావానికి నిదర్శనమని..దీనిని వెంటనే  తొలగించాలని డిమాండ్ చేశారు. 

ఏపీలో వైసీపీ గెలిచిందంటే బీజేపీ గెలిచినట్టేనని నారాయణ అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే ఎక్కువ వైసీపీ నుంచి ఎక్కువ మద్ధతు లభిస్తోందన్నారు. టీడీపీని బలహీనపర్చడం కోసం పవన్ కళ్యాణ్‌ను బీజేపీ తమవైపు లాగుతోందన్నారు. మోడీకి మద్ధతిచ్చే వైసీపీకి వ్యతిరేకంగా అందరూ కలవాల్సిన అవసరం ఉందన్నారు. పవన్ కళ్యాణ్ ఎంతవరకు కలిసొస్తారో చూడాలని అన్నారు.