బీజేపీని నిలువరించడానికే టీఆర్ఎస్ కు మద్దతు

బీజేపీని నిలువరించడానికే టీఆర్ఎస్ కు మద్దతు
  • సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

మహబూబాబాద్, వెలుగు: మోడీ వ్యతిరేక ఫ్రంట్​లో తాము కీలకపోత్ర పోషిస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. బుధవారం సాయంత్రం మహబూబాబాద్​జిల్లా కేంద్రంలో నిజాం చెరువు నుంచి కోర్టు సెంటర్ వరకు సీపీఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి విజయసారథి అధ్యక్షతన నిర్వహించిన పార్టీ జిల్లా రెండో మహాసభలో మాట్లాడారు. మునుగోడు అసెంబ్లీ  ఉప ఎన్నికల్లో బీజేపీ ప్రభావాన్ని నిలువరించడం కోసమే టీఆర్ఎస్ కు సీపీఐ సంపూర్ణ మద్దతు తెలుపుతోందన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా సీఎం  కేసీఆర్ పోరాడినంతకాలం తమ సంఘీభావం ఉంటుందని, ఆయన విధానం మారితే మద్దతు ఉపసంహరించుకుంటామని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి బీజేపీ ప్రభుత్వం 20 వేల కోట్ల కాంట్రాక్టు పనులను కట్టబెట్టడం వల్లే ఆయన ఉప ఎన్నికల్లో  బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్నట్లు ఆరోపించారు. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధులు, వాటాలు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు .

బీజేపీని ప్రశ్నిస్తే ఈడీతో దాడులు చేయించడం, సీబీఐతో కేసులు పెట్టించడం దారుణమన్నారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, కాజీపేట కేంద్రంగా కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు, ఇతర హామీలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో కనీస సౌకర్యాలు కల్పించాలని, స్టూడెంట్లను వేధించడం మానుకోవాలని కోరారు. సమావేశంలో కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీనివాసరావు, తమ్మెర విశ్వేశ్వరరావు, సీపీఐ ఫ్లోర్ లీడర్ అజయ్ సారథి తదితరులు పాల్గొన్నారు.