కాంగ్రెస్ కలిసి రాకుంటే ఒంటరి పోరు : కూనంనేని సాంబశివరావు

కాంగ్రెస్  కలిసి రాకుంటే ఒంటరి పోరు : కూనంనేని సాంబశివరావు
  • సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

అశ్వారావుపేట, వెలుగు: కాంగ్రెస్  తమ పార్టీని కలుపుకొని పోకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. శనివారం పట్టణంలోని ఓ ప్రైవేట్  ఫంక్షన్  హాల్ లో జరిగిన సీపీఐ జిల్లా మూడవ సభకు ఆయన హాజరై మాట్లాడారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన అమిత్  షా మార్చి 26 కల్లా మావోయిస్టులను లేకుండా చేస్తామనడం సరైంది కాదని, ఏం తప్పు చేశారని మావోయిస్టులను లేకుండా చేస్తామంటున్నారని ప్రశ్నించారు. మావోయిస్టులను కాదు.. టూరిస్టులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను అంతం చేయాలన్నారు. 

కమ్యూనిస్టులను లేకుండా చేయడం నిజాం నవాబులతోనే కాలేదన్నారు. కొందరు కాంగ్రెస్  నాయకులు తమ వల్లే గెలిచారని  అంటున్నారని, సీపీఐ లేకపోతే కాంగ్రెస్  గెలిచేదా? అనే విషయంపై ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. సీపీఐ నేత పువ్వాడ నాగేశ్వరరావు, నల్గొండ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నలికంటి సత్యం, భాగం హేమంతరావు, అయోధ్య, మౌలానా, షాబీర్  పాషా, నరాటి ప్రసాద్, సలీం పాల్గొన్నారు.