క్రికెట్‌లో మరో కొత్త రూల్.. టీ20 చరిత్రలో మొదటిసారి

క్రికెట్‌లో మరో కొత్త రూల్.. టీ20 చరిత్రలో మొదటిసారి

క్రికెట్‌ క్రీడా ప్రపంచంలోకి మరో కొత్త రూల్ రాబోతోంది. ఫుట్‌బాల్‌ను స్ఫూర్తిగా తీసుకుని, ఓ టోర్నీ నిర్వాహకులు రెడ్ కార్డ్ లాంటి వ్యవస్థను తీసుకొచ్చారు. వెస్టిండీస్ దీవులలో జరిగే కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2023(సీపీఎల్) నుంచి దీన్ని అమలు చేయనున్నారు.

సాధారణంగా రెడ్ కార్డు అనే పదం ఫుట్ బాల్ గేమ్‌లో ఎక్కువుగా వింటుంటాం. ఒక ఆటగాడు.. మరొక ఆటగాడిపై దాడి చేయడం లేదా ఏదైనా ఇతర హింసాత్మక చర్యకు పాల్పడినా లేదా అంపైర్‌ పట్ల అనుచితంగా ప్రవర్తించడం లేదా ఉద్దేశపూర్వకంగా అతనిపై దాడి చేయడం వంటి ఘటనల్లో రెడ్ కార్డు జారీ చేస్తుంటారు. కానీ క్రికెట్‌లోకి ఈ రూల్‌ని తీసుకొస్తుంది మాత్రం పూర్తిగా విభిన్నం. 

క్రికెట్‌లో రెడ్ కార్డు రూల్

స్లో ఓవర్ రేట్‌కు పెనాల్టీగా రెడ్ కార్డ్ వ్యవస్థను తీసుకోచ్చారు. దీని ప్రకారం.. ఒక జట్టు ఇన్నింగ్స్ 20వ ఓవర్ ప్రారంభానికి ముందువరకూ వేయాల్సిన ఓవర్ల కంటే వెనుకబడి ఉంటే అంపైర్లు లేదా మ్యాచ్ రిఫ్రీ ఒక ఆటగాడిని మైదానం నుండి బయటకి పంపిస్తారు. అంటే 20వ ఓవర్‌లో పది మంది ఆటగాళ్లను మాత్రమే ఫీల్డింగ్‌కు అనుమతిస్తారు. టీ20 క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి ఈ రూల్‌ని  ప్రవేశపెడుతున్నారు.

ఇవేమి రూల్స్‌రా అయ్యా.. 

నిబంధనల ప్రకారం.. నిర్ణీత స‌మ‌యం అంటే 85 నిమిషాల్లో 20 ఓవ‌ర్ల కోటా పూర్తి చేయాలి. ఆ త‌ర్వాత రెండో జ‌ట్టు కూడా ఇదే స‌మ‌యంలో మొత్తం ఓవ‌ర్లు వేయాలి. అలాగే ఆట మొద‌లైన 72 నిమిషాల 15 సెక‌న్ల‌లో 17వ ఓవ‌ర్ పూర్తి కావాలి. అలా కాని ప‌క్షంలో 18వ ఓవ‌ర్‌కు ముందు 30యార్డ్ సర్కిల్‌లో ఒక అద‌న‌పు ఫీల్డ‌ర్‌ను పెట్టాల్సి ఉంటుది. అప్పుడు సర్కిల్‌లో మొత్తం ఐదుగురు ఫీల్డర్లు అవుతారు. 

అలాగే 18వ ఓవ‌ర్ ను 76 నిమిషాల 30 సెక‌న్ల‌లో ముగించాలి. అలా జ‌ర‌గ‌కుంటే.. 19వ ఓవ‌ర్ వేయడానికి ముందు ఇద్ద‌రు అద‌నపు ఫీల్డ‌ర్ల‌ను 30 యార్డ్ సర్కిల్‌లో ఉంచాలి. అప్పుడు సర్కిల్‌లో ఆరుగురు ఫీల్డర్లు ఉన్నట్లు లెక్క.

అంతేకాదు 19వ ఓవ‌ర్‌ను 80 నిమిషాల 45 సెక‌న్ల లోపు వేయాలి. ఒక‌వేళ అంత‌కంటే ఎక్కువ స‌మ‌యం ప‌డితే 20వ ఓవ‌ర్‌కు ముందు ఫీల్డింగ్ జట్టు ఒక ఆటగాడిని కోల్పోవాల్సి ఉంటుంది. అయితే.. ఎవ‌రిని గ్రౌండ్ నుంచి పంపాల‌నేది ఆయా కెప్టెన్లు నిర్ణ‌యించుకోవ‌చ్చు. అంతేకాదు ఆరుగురు ఫీల్డ‌ర్లు స‌ర్కిల్‌లోనే ఉండాల్సి వ‌స్తుంది. ఈ రూల్స్ తెలుసుకొని నెటిజెన్స్ ఆశ్చర్యపోతున్నారు. తెలివి ఎక్కువైనప్పుడు ఇలాంటివి తీసుకొస్తారని ఎద్దేవా చేస్తున్నారు.

 మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్న కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) 2023 ఆగస్ట్ 16 నుంచి ప్రారంభంకానుంది. సెయింట్ లూసియా కింగ్స్, జమైకా తల్లావాస్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది.