- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఖాళీలను భర్తీ చేయాలి : బీవీ రాఘవులు
- హైదరాబాద్లో సీపీఎం ఆధ్వర్యంలో నిరుద్యోగుల మహాధర్నా
హైదరాబాద్, వెలుగు: గతంలో దేశంలో ‘జాబ్ లెస్(ఉద్యోగాలు లేని)’ అభివృద్ధి జరిగితే.. ఇప్పుడు మోదీ పాలనలో ఏకంగా ‘జాబ్లాస్ (ఉద్యోగాలు ఊడే)’ అభివృద్ధి జరుగుతోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. బుధవారం హైదరాబాద్లోని ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో నిరుద్యోగుల మహాధర్నా జరిగింది. ఈ కార్యక్రమానికి రాఘవులు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో అందరికీ తిండి, చదువు, వైద్యంతో పాటు ఉపాధి కల్పనను, పెన్షన్ను ప్రాథమిక హక్కులుగా మార్చాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం చేస్తున్న పోరాటాలకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేయాలన్నారు. దేశంలో ఉన్నత చదువులు చదివిన నిరుద్యోగులు 24 శాతం మంది ఉన్నారని రాఘవులు తెలిపారు.
తెలంగాణలో ఆ సంఖ్య 17 శాతంగా ఉందన్నారు. దేశ సంపదను, సహజ వనరులను మోదీ సర్కార్ అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతోందని మండిపడ్డారు. ఖనిజాల కోసం చత్తీస్గఢ్ అడవుల నుంచి ఆదివాసీలను తరిమేస్తున్నారని ఫైర్ అయ్యారు. అభివృద్ధి పేరుతో 15 లక్షల ఎకరాల భూములను కార్పొరేట్లకు కట్టబెట్టారని చెప్పారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ.. తెలంగాణలో గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు నిరుద్యోగులను మోసం చేయడంలో పోటీ పడుతున్నాయని విమర్శించారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని రేవంత్ రెడ్డి సర్కార్ బుట్టదాఖలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఎం నేతలు టి. జ్యోతి, ఎస్. వీరయ్య, జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్ రావు, డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
