హైదరాబాద్ సిటీ, వెలుగు: దుర్గం చెరువులోకి మురుగు చేరకుండా చర్యలు తీసుకోవాలని సీఎంసీ కమిషనర్ సృజన ఆదేశించారు. శనివారం ఆమె దుర్గం చెరువును విజిట్చేశారు. సీఎంసీ, వాటర్ బోర్డు ఉన్నతాధికారులతో కలిసి ఎస్టీపీ, ఇన్ లెట్, ఔట్ లెట్లను పరిశీలించారు. సోమవారం నాటికి మురుగు పూర్తిగా ఎస్టీపీకి మళ్లించాలని, అక్కడ శుద్ధి చేసిన తర్వాతే చెరువులోకి మళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. సీఎస్ఆర్ లో భాగంగా రహేజా సంస్థ ఈ పనులు చూసుకోవాలన్నారు.
ఎస్ఎన్డీపీ బాక్స్ డ్రెయిన్ పనుల కారణంగా దెబ్బతిన్న సీవరేజ్ లైన్ను పునరుద్ధరించాలని, భవిష్యత్లో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా శాశ్వత పైప్లైన్లు నిర్మించాలన్నారు. టీ-హబ్, టీజీఐఐసీ లేఅవుట్ ప్రాంతం నుంచి వస్తున్న మురుగు ప్రవాహాన్ని పరిశీలించి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సోమవారం మరోసారి చెరువుకు వచ్చి పనుల పురోగతిని పరిశీలిస్తానన్నారు.
