క్రెడిట్ కార్డ్​ ఫైన్ మాఫీ పేరుతో ..రూ.1.80 లక్షల మోసం

క్రెడిట్ కార్డ్​ ఫైన్ మాఫీ పేరుతో ..రూ.1.80 లక్షల మోసం

బషీర్​బాగ్, వెలుగు: క్రెడిట్ కార్డుపై ఉన్న ఫైన్ మాఫీ చేస్తామని నమ్మబలికి సైబర్​నేరగాళ్లు ఓ ప్రైవేట్​ఉద్యోగిని మోసం చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం.. సిటీకి చెందిన ప్రైవేట్​ఉద్యోగి(48)కి ఇటీవల స్కామర్లు కాల్​చేశారు. ఎస్​బీఐ క్రెడిట్ కార్డు డిపార్ట్​మెంట్​నుంచి అని చెప్పారు. ‘మీరు క్రెడిట్​కార్డు వాడకపోవడంతో ఫైన్​పడింది. ఆ ఫైన్​అమౌంట్ ను మేము మాఫీ చేస్తాం. ప్రాసెస్ చేయడానికి వీడియో కాల్ చేయండి’ అని తెలిపారు.

 నిజమేనని నమ్మిన ప్రైవేట్​ఉద్యోగి స్కామర్లు చెప్పిన నంబర్​కు వీడియో కాల్ చేశాడు. క్రెడిట్ కార్డు వివరాలు, సీవీవీ నంబర్​చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత క్రెడిట్​కార్డు నుంచి డబ్బు డెబిట్​అవుతున్నట్లు మెసేజ్​లు, ఓటీపీలు వచ్చాయి. కాల్ డిస్​కనెక్ట్ చేసి చెక్​చేసుకోగా, మొత్తం రూ.1,80,000 డెబిట్ అయినట్లు గుర్తించాడు. అయితే అతని క్రెడిట్​కార్డు లిమిట్ రూ.50 వేలు కాగా, అంతకు మించి డెబిట్​కావడంతో కంగుతిన్నాడు. వెంటనే ఆన్​లైన్​లో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.