- ఫండ్స్ రిలీజ్పై ప్రభుత్వం ఉత్తర్వుల జారీ
హైదరాబాద్, వెలుగు: మార్చి 22 నుంచి ఏప్రిల్ 27 వరకు రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. నిధులు విడుదల చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే మొదటి విడతగా మార్చి17 నుంచి 21 వరకు పడ్డ చెడగొట్టు వానలకు రాష్ట్రవ్యాప్తంగా 1.30 లక్షల మంది రైతులకు చెందిన 1.51 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే రూ.151.64 కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది.
తాజాగా రెండో విడత పంట నష్టంపై సర్వే చేసిన వ్యవసాయ శాఖ మార్చి 22 నుంచి ఏప్రిల్ 27 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2.79 లక్షల మంది రైతులకు సంబంధించిన 3.04 లక్షల ఎకరాల్లో నష్టం జరిగినట్లు తేల్చింది. దీనికి అనుగుణంగా ఎకరాకు రూ.10 వేల చొప్పున రూ. 304.61 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.