చైర్మన్​ కాంగ్రెస్​.. వైస్ చైర్మన్​ బీజేపీ

చైర్మన్​ కాంగ్రెస్​.. వైస్ చైర్మన్​ బీజేపీ
  • భువనగిరి మున్సిపాలిటీలో కౌన్సిలర్ల క్రాస్ ఓటింగ్

యాదాద్రి, వెలుగు : క్రాస్​ ఓటింగ్​, ఇంటర్నల్​ఒప్పందంతో భువనగిరి మున్సిపల్​ చైర్మన్​ పదవిని కాంగ్రెస్​, వైస్​ చైర్మన్​ పదవిని బీజేపీ కైవసం చేసుకున్నాయి. సొంత పార్టీ కౌన్సిలర్ల అవిశ్వాసం కారణంగా భువనగిరి మున్సిపాలిటీ చైర్మన్​, వైస్​ చైర్మన్ల పదవులను బీఆర్ఎస్​ కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్నికల కమిషన్​ కమిషన్ ఆదేశాల మేరకు ప్రిసైడింగ్​ ఆఫీసర్, స్పెషల్​ డిప్యూటీ కలెక్టర్​ జయశ్రీ  చైర్మన్​, వైస్​ చైర్మన్ల పదవులకు బుధవారం ఎన్నికలు నిర్వహించారు. 

క్యాంపుల నుంచి నేరుగా..

చైర్మన్​, వైస్​  చైర్మన్ల పదవులను దక్కించుకోవడం కోసం క్యాంపులకు వెళ్లిన కాంగ్రెస్​, బీఆర్ఎస్​ అసమ్మతి కౌన్సిలర్లు బుధవారం నేరుగా వాహనాల్లో మున్సిపాలిటీకి వచ్చారు. మీటింగ్​ హాలుకు చేరుకున్న కౌన్సిలర్లు పార్టీల వారీగా  కేటాయించిన సీట్లలో కూర్చోగానే వారితో సంతకాలు తీసుకున్నారు. ఎక్స్​ అఫీషియో ఓటుతో కలిపి 36 మంది మీటింగ్‌కు రావాల్సి ఉండగా 30 మంది వచ్చారు.

ఎక్స్​అఫిషియో మెంబరైన ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​ రెడ్డి సహా కాంగ్రెస్​ నుంచి 12 మంది వచ్చారు.  బీఆర్ఎస్​ 9, బీజేపీ 7, ఇద్దరు ఇండిపెండెంట్లు మీటింగ్​కు వచ్చారు. చైర్మన్, వైస్​ చైర్మన్​ ఎన్నికకు సంబంధించిన రూల్స్‌ను ప్రిసైడింగ్​ ఆఫీసర్​ జయశ్రీ చదివి విన్పించారు. అనంతరం చైర్మన్​గా పోటీ చేసే వారిని ప్రతిపాదించాలని సూచించారు. 

క్రాస్​ఓటింగ్​ .. చైర్మన్​ కాంగ్రెస్‌కు..​

దీంతో కాంగ్రెస్​ తరఫున పోతంశెట్టి వెంకటేశ్వర్లు, బీజేపీ తరపున బొర్ర రాకేశ్​ పేర్లను తోటి కౌన్సిలర్లు ప్రతిపాదించి బలపర్చారు. అనంతరం చేతులెత్తే పద్ధతిలో ఓటింగ్​ నిర్వహించారు. దీంతో కాంగ్రెస్​కు అనుకూలంగా బీజేపీ కౌన్సిలర్​ ఊదరి లక్ష్మి, బీఆర్​ఎస్​ కౌన్సిలర్లు అవంతిక, అరుణ, వెంకట్​ నాయక్​ ఓటేశారు. వీరితో పాటు ఇండిపెండెంట్లు అంజమ్మ, అనురాధ, ఎక్స్​ అఫీషియో మెంబరైన ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​ రెడ్డి, 11 మంది కాంగ్రెస్​ కౌన్సిలర్లు ఓటేశారు.  కాంగ్రెస్​ అభ్యర్థికి 18 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థికి ఆరు ఓట్లు వచ్చాయి. దీంతో కాంగ్రెస్​ అభ్యర్థి పోతంశెట్టి వెంకటేశ్వర్లు చైర్మన్​గా ఎన్నికైనట్టు  ప్రిసైడింగ్​ఆఫీసర్​ ప్రకటించారు. 

కాంగ్రెస్​కు రెండుమార్లు ఓటింగ్​

చైర్మన్​ ఎన్నిక సందర్భంగా మీటింగ్‌లో ఓ ట్విస్ట్​ జరిగింది. ప్రిసైడింగ్​ఆఫీసర్​ జయశ్రీ కాంగ్రెస్​కు రెండుమార్లు ఓటింగ్​ నిర్వహించారు. అభ్యర్థిని కాంగ్రెస్​ ప్రతిపాదించి, బలపరచగానే.. చేయిలేపి ఓటు వేయాలని ప్రిసైడింగ్​ ఆఫీసర్​ సూచించారు. దీంతో కాంగ్రెస్​ అభ్యర్థి పోతంశెట్టి వెంకటేశ్వర్లుకు 18 మంది ఓటేశారు. అనంతరం బీఆర్​ఎస్​ అభ్యర్థిని సూచించాలని ప్రిసైడింగ్​ఆఫీసర్​ చెప్పారు. దీంతో బీజేపీ కౌన్సిలర్​రత్నపురం బలరాం అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్షరమాల ప్రకారం ముందుగా బీజేపీకి ఎన్నిక నిర్వహించాలని చెప్పారు. దీంతో ముందు బీజేపీకి ఓటింగ్​ నిర్వహించి అనంతరం మరోసారి కాంగ్రెస్​కు ఓటింగ్​ నిర్వహించారు. 

కౌన్సిలర్​ పదవికి రాజీనామా

వైస్​ చైర్మన్​ పదవికి కాంగ్రెస్​ పోటీ చేయకపోవడాన్ని నిరసిస్తూ కౌన్సిలర్​ ప్రమోద్​కుమార్​ మీటింగ్​నుంచి వెళ్లిపోగా.. ఎన్నిక ముగిసిన తర్వాత 20 వ వార్డు కౌన్సిలర్​ పచ్చల హేమలత తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఇన్​చార్జ్​ కమిషనర్​ కొండల్​రావుకు రాజీనామా పత్రాన్ని అందించారు. తమను ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​ రెడ్డి పట్టించుకోవడం లేదనిచ  త్వరలో కాంగ్రెస్​కు కూడా రాజీనామా చేస్తానని తెలిపారు. 

కాంగ్రెస్​ మౌనం.. వైస్ చైర్మన్‌ పదవి బీజేపీకి..

చైర్మన్​ ఎన్నిక అనంతరం వైస్​ చైర్మన్​ ఎన్నిక కోసం అభ్యర్థులను ప్రతిపాదించాలని ప్రిసైడింగ్​ ఆఫీసర్​ సూచించారు.  బీజేపీ కౌన్సిలర్లు మాయ దశరథ పేరును ప్రతిపాదించి బలపరచారు.  ఈ క్రమంలో కాంగ్రెస్​ కౌన్సిలర్​ పోత్నక్​ ప్రమోద్​కుమార్​ ఎమ్మెల్యేను ఉద్దేశించి మాట్లాడబోయారు.  ఆయన మౌనంగా ఉండమని సూచించడంతో ప్రమోద్ ​కుమార్​అసహనంగా మీటింగ్​ నుంచి వెళ్లిపోయారు.  ఆరుగురు బీఆర్ఎస్​ సభ్యులు కూడా బయటకు వెళ్లిపోయారు. కాంగ్రెస్​, బీఆర్‌‌ఎస్‌ నుంచి ఎవరూ పోటీ చేయకపోవడంతో వైస్​ చైర్మన్​గా బీజేపీ కౌన్సిలర్​మాయ దశరథ ఎన్నికైనట్టు ప్రిసైడింగ్​ ఆఫీసర్​ ప్రకటించారు. అనంతరం చైర్మన్​, వైస్​ చైర్మన్​తో ప్రమాణం చేయించారు.