తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 25 గంటలు

తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 25 గంటలు

 తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. తిరుమల కొండ నిండా భక్తులే ఉన్నారు. వరుస సెలవులు ... వీకెండ్ కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు.‌ తమిళనాడు, కర్ణాటక భక్తులు భారీగా తిరుమలకుతరలి వచ్చారు.  తిరుమల శ్రీవారి దర్శనానికి 25 గంటల సమయం పడుతోంది.తిరుమలలో ఎటు చూసిన గోవిందా… గోవిందా అంటూ భక్తులు క్యూలైన్ లోకి చేరుకుంటున్నారు. ఇప్పటికే వైకుంఠం క్యూ కాంపెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. శుక్రవారం ( జనవరి 26) ఉదయం నుంచి తిరుమలలో అనూహ్య రీతిలో భక్తుల రద్దీ కొనసాగుతూ వస్తుంది. ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ పూర్తిగా నిండిపోయింది. బయట క్యూలైన్లలో భక్తులు భారీగా బారులు తీరి ఉన్నారు.  మరో రెండు రోజులపాటు రద్దీ కొనసాగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు.  ఇక క్యూలైన్ లో వేచిఉన్న భక్తులకు టీటీడీ అన్నప్రసాదాలను శ్రీవారి సేవకుల ద్వారా అందిస్తోంది. క్యూలైన్ లో ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది టీటీడీ.

 వైకుంఠము రెండు లోని 33 కంపార్ట్మెంట్ లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వైకుంఠము ఒకటి లోని 16 కంపార్ట్ మెంట్‌లో భక్తులు నిండిపోయారు. ఒక్కో కంపార్ట్మెంట్ లో 500 మంది భక్తులు వేచి ఉన్నారు. గంటకు 4 వేల మంది భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు అధికారులు. మరోవైపు పెరుగుతున్న క్యూలైన్‌తో దాదాపు 4 కిలో మీటర్ల వరకు చేరారు భక్తులు. 7 నారాయణ గిరి షెడ్లలోనూ భక్తులు నిండిపోయారు.


ఏటిసి సర్కిల్ నుంచి ఎస్ఎంసి మీదుగా లేపాక్షి, రామ్ భగీచ, ఫైర్ స్టేషన్, వరహా స్వామి గెస్ట్ హౌస్, సేవా సదన్ నుంచి స్వామి దర్శనం కోసం క్యూ లైన్‌లోకి భక్తులను అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు.  భక్తులు రద్దీ ఎక్కువగా ఉండటంతో.. వసతి సౌకర్యం దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు భక్తులు. అనూహ్యంగా భక్తులు పోటెత్తడంతో శ్రీవారి సేవా సదన్ వరకు రద్దీ నెలకొంది.వీకెండ్​ కావడంతో  శ్రీవారి మెట్ల మార్గాలలో భక్తుల కోలాహలం కనిపిస్తుంది.