- ధర్మ దర్శనానికి మూడు, స్పెషల్ దర్శనానికి గంట సమయం
- స్వామివారి ఖజానాకు రూ.50.49 లక్షల ఆదాయం
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. రద్దీ కారణంగా కొండపైన బస్ బే, దర్శన, ప్రసాద క్యూలైన్లు, కొండ కింద లక్ష్మీపుష్కరిణి, కల్యాణకట్ట, వ్రత మండపాలు కిక్కిరిశాయి. స్వామివారి ధర్మదర్శనానికి మూడు గంటలు, స్పెషల్ దర్శనానికి గంట సమయం పట్టింది.
మరోవైపు ఆలయంలో నిత్య పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఆలయంలో నిర్వహించిన స్వామివారి నిత్యకల్యాణం, సుదర్శన నారసింహ హోమం, సువర్ణపుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించారు.
పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆలయానికి రూ.50,49,359 ఆదాయం వచ్చింది. ప్రసాద విక్రయం ద్వారా అత్యధికంగా రూ.18,00,035, వీఐపీ దర్శన టికెట్ల ద్వారా రూ.8.10 లక్షలు, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.6.50 లక్షలు, బ్రేక్ దర్శనాలతో రూ.4,07,400 అదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
