మునగాల, వెలుగు : ఉద్యానవన పంటల సాగు, డ్రిప్ ఇరిగేషన్తో ఎక్కువ లాభం పొందవచ్చని కేంద్ర హోం అఫైర్స్, విద్యా శాఖ డైరెక్టర్ మర్చింగ్ వర్తింగ్, రూర్కె సైంటిస్ట్ ఆర్కే.నేమా సూచించారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం మాధవరంలో శాఖమూడి అరవింద్ సాగు చేస్తున్న ఖర్జూర, గోల్డెన్ సీతాఫలం, తీగజాతి కూరగాయలు, డ్రిప్ ఇరిగేషన్, మల్చింగ్ విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీటిని పొదుపుగా వాడుకునే విధానాలను ప్రతి రైతు పాటించాలని చెప్పారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయాలని చెప్పారు. అనంతరం ఆకుపాములలో జలశక్తి అభియాన్ కింద నిర్మించిన వాటర్ ట్యాంక్ను పరిశీలించారు. వారి వెంట హార్టికల్చర్ ఆఫీసర్ కన్నా జగన్, డీఆర్డీఏ అడిషనల్ పీడీ పెంటయ్య, మునగాలఎంపీడీవో వెంకటేశ్వర్లు, సర్పంచ్ నంద్యాల విజయలక్ష్మి, పంచాయతీ సెక్రటరీ అక్షిత ఉన్నారు.
జలశక్తి పథకాలు బాగున్నయ్
జలశక్తి అభియాన్ కింద సూర్యాపేట జిల్లాలో చేపట్టిన పథకాలు అద్భుతంగా ఉన్నాయని సెంట్రల్ టీం మెంబర్స్ మర్చింగ్ వర్తింగ్, ఆర్కే.నేమా చెప్పారు. శనివారం కలెక్టరేట్లో కలెక్టర్ టి.వినయ్ కృ-ష్ణారెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షపు నీటిని నిల్వ చేసేందుకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవడం బాగుందన్నారు. జల సంరక్షణ, పంట మార్పిడితో రైతులకు నిరంతర ఆదాయం వచ్చేలా హార్టికల్చర్ ఆఫీసర్లు సూచనలు చేయాలని చెప్పారు. అవసరమైన చోట చెక్డ్యామ్లు కట్టేందుకు ప్రపోజల్స్ పంపితే నిధుల మంజూరుకు చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ఉన్నారు.