
TSPSC పేపర్ లీకేజీలో నిందితుల కస్టడీ ముగిసింది. 9 మంది నిందితులకు వైద్య పరీక్షలు పూర్తి చేశారు. టీఎస్పీఎస్సీలో పని చేస్తున్న 30 మందికి పైగా ఉద్యోగులకు నోటీసులు జారీ చేశారు. వీరిలో ఒక్కొక్కరిని సిట్ అధికారులు విడివిడిగా విచారణ చేయనున్నారు. గ్రూప్ 1లో 103 మందికి 100 మార్కులుపైగా వచ్చినట్లు గుర్తించారు. మార్చి 23వ తేదీన మరోసారి కాన్ఫిడెన్షియల్ రూం సెక్షన్ అధికారి శంకర్ లక్ష్మీ స్టేట్మెంట్ ను రికార్డ్ చేయనున్నారు.
నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ తో సన్నిహితంగా ఉన్న వాళ్లను సైతం సిట్ అధికారులు ఎంక్వయిరీ చేయనున్నారు. పేపర్ లీకేజీలో వారి పాత్ర ఉందా.. వాళ్లు ఏమైనా సాయం చేశారా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. పర్మినెంట్ ఉద్యోగులకే కాకుండా.. ఔట్ సోర్సింగ్ ఐటీ సిబ్బందికి కూడా నోటీసులు జారీ చేయటం కేసులో కీలక పరిణామం అని చెప్పొచ్చు.
టీఎస్ పీఎస్సీ ఉద్యోగులతోపాటు..లీకేజీలో కీలకంగా ఉన్న రేణుకతో సన్నిహితంగా ఉన్న కోచింగ్ సెంటర్ నిర్వాహకలు, అభ్యర్థులను సైతం విచారించాలని నిర్ణయించింది సిట్. గ్రూప్ 1 ర్యాంక్ సాధించిన రాజశేఖర్ ఫ్రెండ్ రమేష్ పాత్రపైనా అనుమానాలు ఉండటంతో అతన్ని కూడా మరోసారి విచారించాలని నిర్ణయించారు.
ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలకు సిట్ నోటీసులు జారీ చేసింది. పేపర్ లీకేజీలపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని ఇళ్లకు వెళ్లి నోటీసులు అంటించింది సిట్. వీటిపై తీవ్ర విమర్శలు రావటంతో.. నోటీసులపైనా స్పందించింది సిట్. నోటీసులు జారీ చేసినంత మాత్రాన.. విచారణకు పిలిచినంత మాత్రాన వాళ్లందరికీ పేపర్ లీకేజీలో సంబంధం ఉందని చెప్పలేం అని.. సమాచార సేకరణ కోసమే విచారణకు పిలిచినట్లు వివరణ ఇచ్చారు అధికారులు.
పేపర్ లీకేజీ కేసులో విచారణ చేసేకొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.. తీగ లాగితే డొంక కదిలినట్లు. బండారం మొత్తం బయటపడుతుంది. ఇదే సమయంలో హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు బీజేపీ డిమాండ్ చేస్తుండగా.. సీబీఐ విచారణకు కాంగ్రెస్ పార్టీతోపాటు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు.