
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సైబర్ క్రైమ్ పీఎస్ లో కేసు నమోదయ్యింది. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. సీఎం రేవంత్ పై కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలను సైబర్ క్రైమ్ పోలీసులకు అందజేశారు బల్మూరి వెంకట్. సీఎం రేవంత్ పట్ల కేటీఆర్ వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు బల్మూరి వెంకట్. కేటీఆర్ వ్యాఖ్యలు సీఎం ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నాయని సామజిక శాంతిని భంగపరిచే విధంగా ఉన్నాయని ఫిర్యాదు చేశారు వెంకట్.
బుధవారం ( జూన్ 11 ) కాళేశ్వరం కమిషన్ విచారణ సందర్బంగా మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ మాజీ మంత్రి కేటీఆర్ పై ఫైర్ అయ్యారు.
‘కేసీఆర్ సిగ్గుందా..? ఏం మాట్లాడుతున్నవ్.. మేం మాట్లాడితే మీ చెవుల్లోంచి రక్తాలు కార్తయ్.. కానీ మాకు సంస్కారం అడ్డొస్తుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కేటీఆర్ ది కాదని దుయ్యబట్టారు. దక్షిణ రాష్ట్రాల్లో చిల్లర గాడు కేటీఆరే నని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి నీలా అయ్య పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి రాలేదని అన్నారు.