
- సరూర్ నగర్కు చెందిన వ్యాపారికి వాట్సాప్ కాల్
- కెనడాలోని మీ కూతురు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యిందని బెదిరింపు
- సీబీఐ విక్రమ్ పేరుతో వాట్సాప్లో రవిగుప్తా ఫొటో డీపీ
- సమయస్ఫూర్తితో తప్పించుకున్న బాధితుడు
హైదరాబాద్, వెలుగు: సరూర్ నగర్కు చెందిన ఓ వ్యాపారిని కెనడా సైబర్ క్రైమ్ పోలీసుల పేరిట బురిడీ కొట్టేంచేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నం చేశారు. సీబీఐ విక్రమ్ పేరిట ఫోన్ వాట్సాప్ నంబర్ డిస్ప్లే అయ్యేలా.. తెలంగాణ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఫొటోను డీపీ (డిస్ప్లే పిక్చర్)గా పెట్టుకుని బెదిరించారు. అయినప్పటికీ సైబర్ క్రిమినల్స్ వలలో చిక్కకుండా బాధితుడు తప్పించుకున్నారు. దీనిపై బాధితుడు శనివారం టీజీ సైబర్ సెక్యురిటీ బ్యూరోలో ఫిర్యాదు చేశారు.
టీజీ సీఎస్బీ డీఎస్పీ కేవీఎం ప్రసాద్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సరూర్నగర్కు చెందిన ప్రైవేటు సెక్యురిటీ సంస్థను నడిపే వ్యాపారి టి. శ్రీనివాస్ రెడ్డికి ఈ నెల 19న ఒక వాట్సాప్ కాల్ వచ్చింది. అందులో పేరు సీబీఐ విక్రమ్గా..డీపీగా హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఫొటో ఉంది. అవతలి నుంచి ఒక మహిళ ఇంగ్లీష్లో మాట్లాడుతూ..ఆయన కూతురు కెనడాలో డ్రగ్స్ కేసులో పట్టుబడిందని చెప్పింది.
వెంటనే డబ్బులు పంపితే ఆమెను ఈ కేసు నుంచి వదిలేస్తామని లేదంటే థర్డ్ డిగ్రీ తప్పదని బెదిరించడం ప్రారంభించింది. ఫోన్ పే చేయాలంటూ ఒక నంబర్ ఇచ్చింది. పదేపదే డబ్బుల కోసం ఒత్తిడి చేస్తుండడంతో అనుమానించిన శ్రీనివాస్రెడ్డి ఆ వాట్సాప్ కాల్ను కట్ చేసి, కెనడా టొరొంటోలో ఉన్న తన కూతురుకు ఫోన్ చేశారు. ఆ సమయంలో తాను ఇంట్లోనే నిద్రపోతున్నానని..క్షేమంగానే ఉన్నానని...ఎలాంటి సమస్య లేదని కూతురు చెప్పింది.
దీంతో తన అనుమానం నిజమైందని గుర్తించిన శ్రీనివాస్రెడ్డి సైబర్ సెక్యురిటీ బ్యూరో అధికారులకు ఫిర్యాదు చేశారు. సైబర్ నేరగాళ్లు చేసిన ఫోన్ నంబర్ పాకిస్తాన్ నుంచి వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే, తెలంగాణ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఫొటోను డీపీగా పెట్టిన తనను మోసగించేందుకు ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్రెడ్డి తన ఫిర్యాదులో కోరారు. ఈ ఘటనపై టీజీ సీఎస్బీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.