డాక్టర్ రెడ్డీస్‌‌కు సైబర్ షాక్‌‌.. రూ.2.16 కోట్లు టోకరా పెట్టిన సైబర్ మోసగాళ్లు

డాక్టర్ రెడ్డీస్‌‌కు సైబర్ షాక్‌‌.. రూ.2.16 కోట్లు టోకరా పెట్టిన సైబర్ మోసగాళ్లు

న్యూఢిల్లీ: డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ రూ.2.16 కోట్ల సైబర్ మోసానికి గురైంది.  గ్రూప్‌‌ ఫార్మాస్యూటికల్స్‌‌ లిమిటెడ్‌‌కి చెల్లించాల్సిన డబ్బుని  నకిలీ ఈమెయిల్‌‌ ద్వారా వచ్చిన అకౌంట్‌‌కు పంపింది.‘kkeshav@grouppharma.in’ బదులుగా ‘KKeshav@Grouppharma.in’ అనే చిరునామా నుంచి వచ్చిన మెసేజ్‌‌ను నిజమైనదిగా నమ్మిన కంపెనీ ఫైనాన్స్ టీం, బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ)లోని మోసగాళ్ల ఖాతాకు డబ్బులు పంపింది.  

గ్రూప్ ఫార్మాస్యూటికల్స్‌‌ పోలీసులను సంప్రదించింది. బీఓబీ అకౌంట్‌‌కు పంపిన ఫండ్స్‌‌ను  ఫ్రీజ్ చేయడానికి చర్యలు తీసుకుంది. ఎఫ్ఐఆర్‌‌‌‌ ప్రకారం, నిందితుడు గుజరాత్‌‌లోని వడోదరకు చెందినవాడు. ఐటీ చట్టంలోని సెక్షన్లు 66(సీ), 66(డీ) కింద కేసు  నమోదు చేశారు. భారతదేశంలో సైబర్ మోసాలు పెరుగుతున్నాయి. 

2024లో రూ.22,000 కోట్లకు పైగా నష్టం జరిగింది. స్పూఫింగ్, డీప్‌‌ఫేక్, ఫిషింగ్ వంటి ఏఐ ఆధారిత మోసాలు ఎక్కువవుతున్నాయి. అయినప్పటికీ నేషనల్ సైబర్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్‌‌సీఆర్‌‌‌‌పీ)కు ఫిర్యాదులు పెద్దగా రావడం లేదు.  ఈ ఏడాది ఫిబ్రవరి 28 నాటికి రూ.36.45 లక్షల విలువైన కేసులే రిజిస్టర్ అయ్యాయి.