- ఏడాదిన్నరలో 55 వేల ఫేక్ ఫోన్ నంబర్లను వాడిన సైబర్ క్రిమినల్స్
- 7,600 బ్యాంక్ అకౌంట్లతో చీటింగ్ ఐపీ అడ్రెస్ దొరికినా, నిందితులు పట్టుబడతలే
- క్యాష్ రికవరీలో పోలీసులకు సవాళ్లు
హైదరాబాద్,వెలుగు: ఫేక్ అకౌంట్లు, నకిలీ సిమ్ కార్డులతో సైబర్ నేరగాళ్ళు ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. వేల సంఖ్యలో ఫేక్ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి రూ.కోట్లు కొట్టేస్తున్నారు. ఏడాదిన్నరలో దేశవ్యాప్తంగా 55,943 ఫోన్ నంబర్లను నేరగాళ్లు వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. గత నెల సైబర్ సేఫ్ విడుదల చేసిన రిపోర్ట్స్ ఆధారంగా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు. ఇందులో ఫోన్ నంబర్స్తో పాటు 7,600 బ్యాంక్ అకౌంట్ల వివరాలు రాబట్టారు. సైబర్ దొంగల డేటా కలెక్ట్ చేస్తున్నారు.
ఢిల్లీ, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్ అడ్డాలుగా..
ఢిల్లీ కేంద్రంగా నైజీరియన్ గ్యాంగ్స్, వెస్ట్ బెంగాల్ కేంద్రంగా లోకల్ సైబర్ దొంగలు మోసాలకు పాల్పడుతున్నారు. ఏజెంట్లకు కమీషన్ ఇచ్చి గ్రామాల్లోని పేదల పేర్లతో సిమ్కార్డులు, బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేసి, సైబర్ నేరాలు చేస్తున్నారు. ఓఎల్ఎక్స్, ఓటీపీ, బ్యాంక్ ఫ్రాడ్స్, ఫేస్బుక్, డేటింగ్ సైట్లతో ట్రాప్ చేస్తున్నారు. ఇందుకోసం ఫేక్ సిమ్ కార్డులు,బ్యాంక్ అకౌంట్లు ఉపయోగిస్తున్నారు. రాజస్థాన్ లోని భరత్ పూర్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ గ్యాంగ్స్ సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కాల్ డేటా,టవర్ లొకేషన్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులకు నిరాశే మిగులుతోంది. ఐపీ అడ్రెస్ ట్రేస్ చేసినా సైబర్ దొంగలను గుర్తించడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి.
రికవరీ కష్టమే..
ప్రాపర్టీ అఫెన్స్ కేసుల్లో జైలుకెళ్లిన నిందితులు అక్కడ నైజీరియన్లతో కలిసి సైబర్ మోసాల గురించి తెలుసుకుంటున్నారు. ఆన్లైన్ మోసాల కోసం ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు. వీటిని నైజీరియన్స్కి అందిస్తున్నారు. ఆన్లైన్ అడ్డాగా నైజీరియన్స్ కొట్టేసిన అమౌంట్ నుంచి కమీషన్ రూపంలో రూ.లక్షలు తీసుకుంటున్నారు. ఏజెంట్స్ కూడా సైబర్ నేరాలకు స్కెచ్ వేసి ఆన్లైన్లో అందినంత దోచేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు చిక్కినా క్యాష్ రికవరీ పోలీసులకు సవాలుగా మారుతోంది. కొట్టేసిన సొమ్ముతో సైబర్ నేరగాళ్లు బినామీ పేర్లతో ప్రాపర్టీని కొనడం,జల్సాలు చేస్తున్నట్లు ఇన్వెస్టిగేషన్ అధికారులు గుర్తించారు. రోజురోజుకి సైబర్ మోసాల సంఖ్య పెరుగుతూనే ఉందని సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు.