సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు జనవరి16 నుంచి 22 వరకు 14 సైబర్ క్రైమ్ కేసుల్లో దేశవ్యాప్తంగా 23 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో 11 మంది ఆన్లైన్ ట్రేడింగ్ మోసాలకు పాల్పడ్డవారే ఉన్నారని సైబర్ క్రైం డీసీపీ వైవీఎస్ సుధీంద్ర తెలిపారు. ప్రధాన కేసులో రూ.2.90 కోట్ల ట్రేడ్ ఫ్రాడింగ్ కేసు ఉందని చెప్పారు. ఈ కేసులో బాధితుడిని నిందితులు వాట్సాప్ గ్రూపుల ద్వారా సంప్రదించి లాభాలు వస్తాయని చెప్పారు. ‘ఆల్ఫా అలయన్స్ ఇన్వెస్ట్మెంట్ క్లబ్’ అనే నకిలీ పెట్టుబడి ప్లాట్ఫామ్లో పెట్టుబడులు పెట్టించారు.
నకిలీ అప్లికేషన్లో వర్చువల్ లాభాలు, ఐపీఓ కేటాయింపులు చూపి, బాధితుడి నుంచి రూ.2,90 కోట్లకు పైగా ట్రాన్స్ఫర్చేయించుకున్నారు. ఈ కేసులో శివకాంత్ రాజు దాట్ల, సూర్య భగవాన్ మోరపాకను అరెస్ట్ చేశారు. 74 ఏళ్ల వృద్ధ మహిళ వద్ద డిజటల్ అరెస్ట్పేరిట రూ.56.50 లక్షలు కొట్టేశారన్నారు. వృద్ధురాలికి తాము ముంబై పోలీసులమని, ఆర్బీఐ నుంచి ఆఫీసర్లను మాట్లాడుతున్నామని చెప్పారు. ఆధార్ను దుర్వినియోగం చేసి మనీ లాండరింగ్ చేసిందని, మానవ అక్రమ రవాణా కేసుల్లో ఇరుక్కున్నారని భయపెట్టారన్నారు. ఈ కేసులో కేసన మాణిక్యరావు, - కేసన లక్ష్మీ నందినిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. అలాగే.. ఇటీవల 70 కేసుల్లో 354 రిఫండ్ ఆర్డర్లు సాధించి, బాధితులకు రూ. కోటికి పైగా ఇప్పించినట్లు చెప్పారు.
