క్రెడిట్ కార్డు నెలవారీ ఛార్జీల నుంచి మినహాయింపు ఇస్తామంటూ సైబర్ నేరగాళ్లు ఓ వ్యక్తి నుంచి రూ. 2.03 లక్షలు కాజేశారు. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారవేత్తకు ఫోన్ చేసి క్రెడిట్ కార్డు నెలవారీ ఛార్జీల నుంచి మినహాయింపు ఇస్తామని నమ్మబలికారు. దీంతో నేరగాళ్లు పంపిన లింక్ క్లిక్ చేసి క్రెడిట్ కార్డు, కేవైసీ వివరాలు నమోదు చేశాడు బాధితుడు. వెంటనే తన బ్యాంకు ఖాతా నుంచి 2.03లక్షలు మాయమయ్యాయి. దీంతో ఆందోళనకు గురైన వ్యాపారి బ్యాంక్కు వెళ్లి ఆరా తీయగా సైబర్ నేరం జరిగినట్లు తెలుసుకున్నాడు. దీంతో బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇక మరో సైబర్ క్రైమ్ ఘటనలో రూ. 12 లక్షల 75 వేలు మోసపోయాడు హైదరాబాద్కు చెందిన ఓ డాక్టర్. తాను ముంబైకి చెందిన సైబర్ క్రైమ్ డీసీపీగా పరిచయం చేసుకున్న నేరగాడు.. బాధితుడి ఆధార్తో అనుసంధానంగా పలు బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, వాటి నుంచి రూ. 8వేల కోట్ల లావాదేవీలు జరిగాయని నేరగాళ్ల బెదిరింపులకు దిగాడు. మనీలాండరింగ్ చట్టం ప్రకారం కేసు నమోదు అయిందని.. రూ. 12 లక్షల 75వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వెంటనే భయంతో కోరిన మొత్తాన్ని చెల్లించి, మోసపోయినట్లు గుర్తించాడు బాధితుడు. వెంటనే సైబర్ క్రైమ్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.