కేంద్ర ప్రభుత్వం మహిళల ఆరోగ్యం కోసం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. గర్భాశయ క్యాన్సర్ (Cervical Cancer) రాకుండా నివారించేందుకు 14 ఏళ్ల బాలికలకు ఉచితంగా HPV వ్యాక్సిన్ అందించాలని నిర్ణయించింది. సాధారణంగా బయట మార్కెట్లో ఈ వ్యాక్సిన్ ధర ఒక్కో డోసు సుమారు రూ. 3,927 వరకు ఉంటుంది. కానీ ప్రభుత్వ కార్యక్రమం కింద దీనిని బాలికలకు పూర్తి ఉచితంగా అందజేస్తారు. దీనివల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుంది.
గతంలో రెండు లేదా మూడు డోసులు వేసుకోవాల్సి వచ్చేది. కానీ కొత్త శాస్త్రీయ ఆధారాల ప్రకారం, 14 ఏళ్ల వయసులో ఒక్క డోసు వేసుకున్నా గర్భాశయ క్యాన్సర్ కలిగించే వైరస్ నుండి జీవితాంతం బలమైన రక్షణ లభిస్తుందని తేలింది. అందుకే ప్రభుత్వం సింగిల్ డోస్ కార్యక్రమాన్ని చేపడుతోంది.
ఎందుకు వేయించుకోవాలంటే :
భారతదేశంలో మహిళలకు వచ్చే క్యాన్సర్లలో గర్భాశయ క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది. ఏటా దాదాపు 80 వేల కొత్త కేసులు, 42 వేల మరణాలు నమోదవుతున్నాయి. ఈ క్యాన్సర్ ప్రధానంగా HPV వైరస్ వల్ల వస్తుంది. చిన్న వయసులోనే టీకా వేయడం వల్ల వైరస్ సోకకముందే శరీరం రోగనిరోధక శక్తిని పొందుతుంది.
ఈ టీకా 2006 నుండి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది. ఇప్పటివరకు 50 కోట్ల డోసులు ఇచ్చారు, ఇంకా చాలా సురక్షితమైనది. ప్రభుత్వ ఆసుపత్రులు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో ఈ టీకాలు వేస్తారు. టీకా వేసిన చోట ఏవైనా చిన్నపాటి ఇబ్బందులు తలెత్తితే వెంటనే వైద్య సహాయం అందించేలా ఏర్పాట్లు చేశారు.
తల్లిదండ్రులకు సూచన:
మీ కూతురి భవిష్యత్తు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, 14 ఏళ్లు నిండిన ప్రతి బాలికకు ఈ టీకా వేయించాలని ప్రతి తల్లిదండ్రులను ప్రభుత్వం కోరుతోంది. మహిళల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఒక గొప్ప మైలురాయిగా నిలుస్తుంది.
►ALSO READ | మీరు తినే కూరగాయల్లో విషపూరిత కెమికల్స్, సీసం.. .. వంకాయ, దొండకాయల్లోనూ ప్రమాదకర స్థాయిలు!
