అయోధ్య రామ మందిరం పేరుతో నకిలీ వెబ్‌‌సైట్స్‌‌ 

అయోధ్య రామ మందిరం పేరుతో నకిలీ వెబ్‌‌సైట్స్‌‌ 
  • క్రియేట్ చేసిన సైబర్ నేరగాళ్లు
  • వీఐపీ ఎంట్రీ, దర్శనం, ప్రసాదం పేరుతో దోపిడీ
  • వాట్సాప్‌‌లో లింక్స్ పంపించి అకౌంట్స్ హ్యాక్

హైదరాబాద్, వెలుగు :  సైబర్‌‌ నేరగాళ్లు ఇప్పుడు అయోధ్య రామ మందిరాన్ని టార్గెట్‌‌ చేశారు. రామ మందిరం పేరుతో నకిలీ వెబ్‌‌సైట్స్‌‌ను సృష్టించారు. దర్శనం, వీఐపీ ఎంట్రీ టికెట్స్, ప్రసాదం పంపిణీ, డొనేషన్స్‌‌ పేరుతో ఆన్‌‌లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. క్యూఆర్‌‌ కోడ్‌‌, ఏపీకే ఫైల్స్‌‌ పంపించి అందినకాడికి దోచేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి మోసాలు జరుగుతుండడాన్ని స్టేట్ సైబర్ క్రైమ్‌‌ బ్యూరో పోలీసులు గుర్తించారు. అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరిస్తూ మంగళవారం ప్రకటన విడుదల చేశారు.

లింక్‌‌లు క్లిక్ చేయగానే..

అయోధ్య రామమందిరం పేరుతో నకిలీ వెబ్‌‌సైట్స్‌‌ను తయారు చేసి సర్క్యులేట్‌‌ చేస్తున్న నేరగాళ్లు.. ఫోన్‌‌ నంబర్స్‌‌కి ర్యాండమ్‌‌గా మెసేజ్‌‌లు, ఏపీకే ఫైల్స్, లింక్స్ షేర్ చేస్తున్నారు. లింకులను క్లిక్ చేసిన వారి మొబైల్‌‌ను తమ కంట్రోల్‌‌లోకి తీసుకుంటారు. మొబైల్‌‌ నంబర్‌‌ లింకైన బ్యాంక్ అకౌంట్స్‌‌ను ఖాళీ చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాట్సాప్‌‌లో రామమందిరం పేరుతో వచ్చే లింక్స్‌‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

నకిలీ లింక్‌‌లు సర్క్యులేట్‌‌ అవుతున్నాయని చెప్తున్నారు. సోమవారం బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా లైవ్ కవరేజ్‌‌ పేరుతో అనుమానాస్పద లింక్స్‌‌ వచ్చినట్లు సైబర్ క్రైమ్ బ్యూరో అధికారులు గుర్తించారు. వేడుకను చూసేందుకు సదరు లింక్‌‌లను ఓపెన్‌‌ చేసిన కొంతమంది సైబర్ దాడులకు గురైనట్లు తెలుసుకున్నారు. దీంతో వాట్సాప్ లేదా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌‌ఫామ్స్‌‌ ద్వారా వచ్చిన అనుమానిత లింక్‌‌ల విషయంలో జాగ్రత్త వహించాలని పోలీసులు చెప్తున్నారు.