ముంచుకొస్తున్న తుఫాన్.. డిసెంబర్ 2న భారీ వర్షాలు

ముంచుకొస్తున్న తుఫాన్.. డిసెంబర్ 2న భారీ వర్షాలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిని తీవ్ర అల్పపీడన ప్రభావంతో పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ వాయుగుండంగా బలపడింది. దీని ప్రభావంతో డిసెంబర్ 2వ తేదీన తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫాను కారణంగా రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీ, తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంచెత్తుతాయని ప్రకటించింది. 

ఈ తుఫానుకు మైచౌంగ్ గా నామకరణం చేశారు. డిసెంబర్ 4, 5వ తేదీనా ఏపీ తీరానికి సమీపంగా వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అది తీరం దాటే ప్రాంతంపై ఇంకా స్పష్టత రాలేదని తెలిపారు. సాధరణంగా ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో ఏర్పడే తుపాన్లు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశాలలో తీరం దాటుతాయని చెబుతున్నారు. వాతావరణ మార్పు కారణంగా ఈ సీజన్‌లో ఇప్పటికే రెండు తుఫాన్లు ఉత్తరదిశగా వెళ్లిపోయాయి. తమిళనాడు నుంచి ఏపీ వరకు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం దీనికి ఒక కారణం అంటున్నారు వాతావరణ అధికారులు.


డిసెంబర్ 1 నుంచి మూడు రోజుల పాటు రాయలసీమ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురవనున్నాయని ఐఎండీ అంచనా వేసింది. అల్పపీడనం కారణంగా కోస్తా ఆంధ్రలో 65.2 మిల్లీమీటర్ల నుంచి 204.4 మిల్లీమీటర్ల వరకూ వర్షపాతం నమోదు అవ్వచ్చని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.