కాంగ్రెస్ , బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చే దమ్ముందా..?: ఎమ్మెల్యే దానం నాగేందర్

కాంగ్రెస్ , బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చే దమ్ముందా..?: ఎమ్మెల్యే దానం నాగేందర్

బషీర్ బాగ్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ , బీజేపీ పని అయిపోయిందని.. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యానించారు.  ఖైరతాబాద్ సెగ్మెంట్ లోని పీజేఆర్ నగర్ లో కాంగ్రెస్ నుంచి యువత పెద్దఎత్తున ఆదివారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో చేరారు.  ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆ రెండు పార్టీలు ప్రభుత్వంలో ఉన్న రాష్ట్రాల్లో  దళిత బంధు , బీసీ బంధు, డబుల్ బెడ్రూమ్ లు ఇచ్చే దమ్ముందా..? అని ప్రశ్నించారు. 

ఢిల్లీ లీడర్లు వచ్చి ప్రగల్భాలు పలుకుతున్నారని, మీ పార్టీలు గెలిచిన రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని హితవు పలికారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరిట దళితులకు 12లక్షలు , మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్న కాంగ్రెస్ .. మీ పార్టీ ప్రభుత్వం ఉన్న రాష్టాల్లో ఇచ్చి ఇక్కడ అడుగుపెట్టాలని సవాల్ చేశారు. ఎన్ని డిక్లరేషన్లు పెట్టినా వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ అధికారం చేపట్టడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తంచేశారు.