విమానం నడపడానికి పనికిరావు.. పోయి చెప్పులు కుట్టుకో .. దళిత ట్రైనీ పైలట్‌‌‌‌కు అవమానం

విమానం నడపడానికి పనికిరావు.. పోయి చెప్పులు కుట్టుకో .. దళిత ట్రైనీ పైలట్‌‌‌‌కు అవమానం
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు.. అట్రాసిటీ కేసు నమోదు

న్యూఢిల్లీ: తాను కుల వివక్షకు గురైనట్లు ఇండిగో ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌లో పనిచేస్తున్న 35 ఏండ్ల దళిత ట్రైనీ పైలట్‌‌‌‌ ఆరోపించారు. ముగ్గురు సీనియర్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు తనను పైలట్‌‌‌‌ ఉద్యోగానికి పనికిరావని, ఇంటికెళ్లి చెప్పులు కుట్టుకోవాలంటూ అవమానించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గురుగ్రామ్‌‌‌‌ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏప్రిల్‌‌‌‌ 28న జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

డ్యూటీపరంగానూ వేధింపులు..

ఏప్రిల్‌‌‌‌ 28న గురుగ్రామ్‌‌‌‌లోని ఇండిగో ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీటింగ్​లో ముగ్గురు సీనియర్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు తనను కులం పేరుతో దూషించారని ట్రైనీ పైలట్‌‌‌‌గా పనిచేస్తున్న అశోక్‌‌‌‌ కుమార్‌‌‌‌(35)‌‌‌‌ ఆరోపించారు. తపస్‌‌‌‌ డే, మనీశ్‌‌‌‌ సాహ్ని, రాహుల్‌‌‌‌ పాటిల్‌‌‌‌ తనను చమార్, భంగీ వంటి పదజాలంతో దూషించారని పేర్కొన్నారు. ‘‘నువ్వు విమానం నడపడానికి పనికిరావు. వెళ్లి చెప్పులు కుట్టుకో. ఇక్కడ వాచ్‌‌‌‌మన్‌‌‌‌గా కూడా పనికిరావు’’ అని తిట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలు తనను మానసికంగా గాయపర్చాయని అశోక్‌‌‌‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఇండిగో ఎయిర్‌‌‌‌లైన్స్ సీఈవో, ఎథిక్స్‌‌‌‌ కమిటీకి నివేదించినప్పటికీ నిందితులపై చర్యలు తీసుకోలేదని తెలిపారు. కావాలనే తనకు ట్రావెల్‌‌‌‌ అలవెన్స్‌‌‌‌ రద్దు చేశారని, నోటీసులిచ్చారని, జీతంలోనూ అన్యాయంగా కోతలు విధించి.. డ్యూటీపరంగా వేధించారని వివరించారు. దీనిపై బెంగళూరు పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌లో జీరో ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌ నమోదు కాగా, కేసు గురుగ్రామ్‌‌‌‌కు ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఈ ఘటనపై సోషల్‌‌‌‌ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిందితులపై చర్యలు తీసుకోవాలని ఇండిగోను నెటిజన్లు డిమాండ్‌‌‌‌ చేస్తున్నారు.

అవన్నీ నిరాధార ఆరోపణలే: ఇండిగో

ఇవన్నీ నిరాధార ఆరోపణలేనని ఇండిగో యాజమాన్యం కొట్టిపారేసింది. తమ కంపెనీలో వివక్ష, వేధింపులు, పక్షపాతం అనేది ఏనాడూ ఉండదని, అలాంటివాటిని తాము సహించబోమని పేర్కొంది. విచారణకు, న్యాయవ్యవస్థకు పూర్తిగా సహకరిస్తామని తెలిపింది.