హైదరాబాద్, వెలుగు : జలమండలి పరిధిలో పని చేసేందుకు 162 సిల్ట్ కార్ట్ వెహికల్స్ను దళిత బంధులో భాగంగా దళితులకు అందించామని జలమండలి ఎండీ దాన కిశోర్ తెలిపారు. సిల్ట్ కార్టింగ్ వాహనాలను సోమవారం హుస్సేన్ సాగర్ వద్ద మంత్రి కేటీఆర్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వెహికల్స్ కోసం మంత్రి కేటీఆర్ను కోరినట్టు ఎండీ తెలిపారు. వాహనాల ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులే డ్రైవర్, సిబ్బంది అయితే.. వారికి నిర్వహణ ఖర్చులు పోను నెలకు రూ. 97 వేల ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు.
డ్రైవర్లకు రెండు రోజులు శిక్షణ ఇచ్చామన్నారు. ఈ వాహనాల ద్వారా హైదరాబాద్ నగర ప్రజలకు పారిశుద్ధ్య సేవలు మరింత మెరుగవుతాయన్నారు. హైదరాబాద్ జిల్లాకు చెందిన 88 వాహనాలు తక్షణమే అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హైదరాబాద్ నగర పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పురపాలక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, జీహెచ్ ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్, డిప్యూటీ మేయర్ శ్రీలత, కార్పొరేటర్లు, జలమండలి ఈడీ సత్యనారాయణ, డైరెక్టర్లు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.