ఎన్టీఆర్ శతజయంతోత్సవాలు విజయవాడలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, నటుడు రజనీకాంత్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సినీ నటుడు రజనీకాంత్ మాట్లాడుతూ ఎన్టీఆర్ తో తనకు ఉండే సంబంధాన్ని వివరించారు. అనుభవం ఏం మాట్లాడాలో చెబుతుందన్నారు. తనకు ఆరేళ్ల వయస్సులో ఎన్టీఆర్ నటించిన పాతాళ భైరవి సినిమా చూశానని ప్రకటించారు. 18 ఏళ్ల వయస్సులో స్టేజీపై ఎన్టీఆర్ ను ఇమిటేట్ చేశానన్నారు. 1966 శ్రీకృష్ణపాండవీయం చూసి ఎన్టీఆర్ను ఇమిటేట్ చేశానని చెప్పారు. 1977లో ఎన్టీఆర్ తో టైగర్ సినిమాలో నటించానన్నారు. తాను మొదటి సారిగా భైరవి సినిమాలో నటించానని తెలిపారు. ఎన్టీఆర్ నటించిన దానవీరశూరకర్ణ సినిమాను ఎన్నిసార్లు చూశానో తెలియదన్నారు. సినిమాల్లో కాకుండా రాజకీయాల్లో ఎన్టీఆర్ రికార్డు సృష్టించారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన కొద్ది రోజులకే అధికారంలోకి తెచ్చి తెలుగు ప్రజల ఆదరాభిమానాలకు పాత్రులయ్యారని తెలిపారు. 1983లో ఎన్టీఆర్ గెలిచినప్పడు గంతులేశానని సభలో తెలిపారు.
చంద్రబాబు గురించి మాట్లాడుతూ ఇది రాజకీయ సభ కాకపోయినా చంద్రబాబు ఉన్నారు కాబట్టి మాట్లాడాలని రజనీకాంత్ అన్నారు. చంద్రబాబు తనకు 30 ఏళ్ల మిత్రుడన్నారు. మోహన్ బాబు పరిచయం చేశారని చెబుతూ.. హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఆయనను కలిసేవాడినని తెలిపారు. చంద్రబాబు ప్రపంచ రాజకీయాలు బాగా తెలుసన్నారు. విజన్ 2020గురించి గతంలోనే ఆలోచించారని... ఐటీ ప్యూచర్, డిజిటల్ వరల్డ్ను హైదరాబాద్ కు తీసుకొచ్చి హైటెక్ సిటీని స్థాపించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. హైటెక్ సిటిలో ఉన్నప్పుడు.. ఇండియాలో ఉన్నామా.. న్యూయార్క్లో ఉన్నామా అర్దం కాని పరిస్థితి నెలకొందని చంద్రబాబు సేవలను కొనియాడారు. చంద్రబాబు కృషి వల్లే ఐటీ ఉద్యోగులు లగ్జరీగా బతుకుతున్నారని ఎన్టీఆర్ శతజయంతి సభలో రజనీకాంత్ అన్నారు.