శివాజీ, నవదీప్, నందు, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో మురళీకాంత్ రూపొందిస్తున్న చిత్రం ‘దండోరా’. రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 25న సినిమా విడుదల కానుంది. సోమవారం టీజర్ను రిలీజ్ చేశారు. లవ్, కామెడీతోపాటు ఇంటర్నల్గా ఓ మెసేజే ఇచ్చేలా ఉండబోతోందని టీజర్ ద్వారా రివీల్ చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్లో శివాజీ మాట్లాడుతూ ‘ఈ కథ విని ఎంతో కనెక్ట్ అయ్యా. మన సమాజంలోని కుల వ్యవస్థ మీద సెటైరికల్గా స్టోరీని రాసుకున్నారు. ఇందులో ప్రతి పాత్ర గొప్పగా ఉంటుంది. తమిళ, మలయాళ ఆర్టిస్టులే బాగా నటిస్తారు అని అనుకునే వారికి ఈ సినిమా చూస్తే.. అంతకంటే గొప్ప ఆర్టిస్టులు తెలుగులో ఉన్నారని అర్థం అవుతుంది. ఇది మంచి బిర్యానీలాంటి చిత్రం’ అని అన్నాడు.
చావు, కులం అనే పాయింట్లతో ఎంటర్టైనింగ్గా ఎన్నో మంచి విషయాల్ని ఈ సినిమా ద్వారా చూపించబోతున్నట్టు నవదీప్ చెప్పాడు. ఇందులో నటించడం హ్యాపీగా ఉందని నందు అన్నాడు. సమాజంలో ఆలోచనలు రేకెత్తించేలా ఈ చిత్రం ఉంటుందని బిందు మాధవి చెప్పింది. ఈ టీజర్ను అల్లు అర్జున్ చూసి అభినందించారని, అదే తమకు పెద్ద సక్సెస్ అని దర్శకుడు మురళీకాంత్ అన్నాడు. టీజర్ను మించి సినిమా ఉంటుందని నిర్మాత రవీంద్ర బెనర్జీ అన్నారు. నటులు రవికృష్ణ, మౌనిక, ఎడిటర్ సృజన అడుసుమిల్లి పాల్గొన్నారు.
