
15 లక్షల మందికి సోకిన ఇన్ఫ్లుయెంజా వైరస్
వ్యాక్సిన్ వేసుకోండి
ఫ్లూ నుంచి కాపాడుకోవడానికి ఆలోచించకుండా వెంటనే ఫ్లూ వ్యాక్సిన్ వేసుకోవాల్సిందిగా డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటిదాకా 17.3 కోట్ల మందికి వ్యాక్సిన్ వేసినట్టు సీడీసీ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది 40 లక్షల డోసులను ఎక్కువగా తయారు చేసినట్టు చెబుతున్నారు. వ్యాక్సిన్ వేసుకోకపోతే రిస్క్ ఎక్కువని, వ్యాక్సిన్ వేసుకున్నవాళ్లలో 60% మందికి ముప్పు తప్పిందంటున్నారు.
కొత్త కరోనా వైరస్.. ప్రపంచ దేశాల దృష్టంతా ఇప్పుడు దాని మీదే. అవును మరి, కొన్ని వేల మందికి సోకిన ఆ మహమ్మారి వైరస్, కొన్ని వందల మందిని బలి తీసుకుంది. కానీ, ప్రపంచం గుర్తించని దాని కన్నా డేంజర్ వైరస్ అమెరికాలో బీభత్సం సృష్టించింది. కొన్ని లక్షల మందికి సోకింది. వేలాది మందిని బలి తీసుకుంది. ఆ వైరస్ ఫ్లూకు కారణమయ్యే ఇన్ఫ్లుయెంజా (హెచ్1ఎన్1).
8 వేల మందికిపైనే బలి
ఈ ఏడాది (2019–2020) ఫ్లూ సీజన్లో దాదాపు 15 లక్షల మందిని ఇన్ఫ్లుయెంజా వైరస్ పట్టుకుంది. 8,200 మందిని చంపేసింది. అందులో 54 మంది చిన్న పిల్లలున్నారు. ఇది స్వయంగా అమెరికాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ వెల్లడించిన విషయం. అయితే అంతమందికి సోకినా ట్రీట్మెంట్ తీసుకుంది మాత్రం లక్షా 40 వేల మందేనట. అయితే, కేసుల సంఖ్య, మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశమూ లేకపోలేదంటున్నారు అక్కడి నిపుణులు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఫ్లూ కూడా విజృంభించే ముప్పు ఉందని హెచ్చరిస్తున్నారు.
అమెరికాకు కొత్తేం కాదు
నిజానికి అమెరికా జనానికి ఈ ఫ్లూ వైరస్ కొత్తేం కాదు. ఏటా కొన్ని వేల మంది ఆ వైరస్కు బలవుతున్నారు. అయితే, ఇటీవలి కాలంలో కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. ఉదాహరణకు 2017–18 సీజన్లో 4.5 కోట్ల మందికి ఫ్లూ సోకితే, 61 వేల మంది చనిపోయారు. అదే 2018–19లో 1.65 కోట్ల మంది దాని బారిన పడితే, 34 వేల మందికిపైనే హెచ్1ఎన్1కు బలయ్యారు. దేశంలో సగటున ఏటా 12 వేల నుంచి 64 వేల మంది దాకా హెచ్1ఎన్1కు బలవుతున్నారని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) అంచనా వేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా అయితే 6.5 లక్షల మంది ఫ్లూకు బలవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలూ చెబుతున్నాయి. దీనితో పోలిస్తే కరోనా వైరస్ ప్రభావం తక్కువేనంటున్నారు నిపుణులు.
ఫ్లూను తక్కువ చూడొద్దు
మామూలుగా జనాలు ఫ్లూనే కదా అని తీసిపడేస్తున్నారని, కానీ, దానిని తక్కువ అంచనా వేయొద్దని సైంటిస్టులు సూచిస్తున్నారు. సీరియస్గా తీసుకోవాలంటున్నారు. ఫ్లూతో పాటు వేరే ఇన్ఫెక్షన్ ఏదైనా సోకితే దాని ముప్పు ఎక్కువవుతుందని హెచ్చరిస్తున్నారు. దాని వల్ల న్యుమోనియాతో పాటు గుండె వాపు, మెదడు వాపు వంటివి అటాక్ చేస్తాయని, శరీరంలోని అవయవాలు దెబ్బతింటాయని చెబుతున్నారు. ఇక, వైరస్ ఎప్పటికప్పుడు తనను తాను మార్చేసుకుంటోందని, ఒక్కో ఏడాది మరింత స్ట్రాంగ్ అవుతోందని అంటున్నారు. కొన్ని సందర్భాల్లో యాంటీజెనిక్కు షిఫ్ట్ అయిపోతుంటుందని, దాని వల్ల జనం ఇదివరకెన్నడూ ఎరుగని ఓ కొత్త స్ట్రెయిన్ (రకం) పుట్టుకొచ్చి తిప్పలు పెడుతుందని చెబుతున్నారు. ఈ ఏడాది మాత్రం అలాంటి మార్పులేవీ వైరస్లో లేవని అంటున్నారు.