ఆగస్టు 14 నుండి శ్రీశైల దేవస్థానంలో దర్శనాలు పునఃప్రారంభం

ఆగస్టు 14 నుండి శ్రీశైల దేవస్థానంలో దర్శనాలు పునఃప్రారంభం

కర్నూలు: కర్నూలు జిల్లాలో కరోనా కేసులు నియంత్రణలోకి వస్తుండటంతో శ్రీశైల దేవస్థానం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. క‌రోనా నేప‌థ్యంలో గత 25 రోజులుగా దర్శనాలను నిలిపేసిన అధికారులు.. ఆగస్టు 14 నుండి దర్శనాలు తిరిగి ప్రారంభించ‌నున్నారు. శ్రీశైల మహాక్షేత్రంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శనాలు ఉదయం 6.30 గంటల నుండి మధ్యాహ్నం 3.30 గంటల వరకు తిరిగి సాయంత్రం 5.30 గంటల నుండి7.30 గంటల వరకు భక్తులను దర్శనాలకు అనుమతిస్తామని ఈవో కె.ఎస్.రామారావు తెలిపారు.

10 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వయసు ఉన్న వారిని మాత్రమే దర్శనానికి అనుమతించడం జరుగుతుందని ఈవో పేర్కొన్నారు. దర్శనానికి వచ్చే భక్తులు ముందస్తుగా ఆన్ లైన్ లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుందని అలాగే భక్తులు తమ వెంట ఆధార్ కార్డు లేదా గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని తెలిపారు.