హైదరాబాద్, వెలుగు: ఒక పార్టీలో గెలిచి, మరో పార్టీలోకి మారడం నేరం అని, అలా మారినవాళ్లను రాళ్లతో కొట్టి చంపాలన్న రేవంత్రెడ్డి.. అధికారంలోకి వచ్చాక ఆయనే స్వయంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాడని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ విమర్శించారు. ఆదివారం సాయంత్రం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాళ్ల పార్టీ ఎల్పీలను బీఆర్ఎస్లో విలీనం చేసినప్పుడు, వాళ్లను దుర్భాషలాడిన రేవంత్రెడ్డి ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
పార్టీ మారిన దానం నాగేందర్, రంజిత్రెడ్డి తదితరులను వదిలిపెట్టేది లేదన్నారు. డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ వేసి వాళ్ల పదవులు పోగొడుతామని హెచ్చరించారు. ఎమ్మెల్యే టికెట్లలో, రెండ్రోజుల కింద ప్రకటించిన కార్పొరేషన్ పదవుల్లోనూ బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేసిందన్నారు. బీఆర్ఎస్ తిరిగి పుంజుకుంటుందని, ఇప్పుడు పార్టీ నుంచి వెళ్లిపోతున్నవాళ్లు పశ్చాత్తాప పడే రోజులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.