ఏఐ అమ్మాయిలతో వల..డేటింగ్ మత్తులో విలవిల... హైదరాబాద్ లో పెరుగుతున్న డేటింగ్ యాప్ మోసాలు...

ఏఐ అమ్మాయిలతో వల..డేటింగ్ మత్తులో విలవిల... హైదరాబాద్ లో పెరుగుతున్న డేటింగ్ యాప్ మోసాలు...
  • బోర్ కొడుతోందా.. నిద్ర పట్టడం లేదా అంటూ గాలం  
  • ‘డబ్బులక్కర్లేదు రా అయ్యా’ అంటూ అన్నీ దోచేస్తున్నారు  

అమ్మాయిలతో మాట్లాడవచ్చని మల్కాజిగిరికి చెందిన సాఫ్ట్​వేర్​ ఇంజినీర్ డేటింగ్ యాప్ లో ఎంటరయ్యాడు. అక్కడ ‘శిక్ష’ అనే యువతి టచ్​లోకి వచ్చింది. పరిచయాలు, ఇష్టాఇష్టాలు తెలుసుకున్నాక ప్రేమించుకోవడం మొదలుపెట్టారు. ఒకరోజు సదరు యువతి మాట్లాడుతూ మాట్లాడుతూ...‘న్యూడ్​వీడియో కాల్​ఓకేనా’ అని అడిగింది. అతడు ఒకే చెప్పడంతో మొత్తం రికార్డ్​చేసింది. టెలిగ్రామ్​లో లింక్​పంపింది. అతడు ఓపెన్​చేయగా ఫోన్​హ్యాక్​అయి కాంటాక్ట్ లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేతికి చిక్కింది. 

డబ్బులివ్వాలని లేకపోతే వీడియోలను కాంటాక్ట్​లిస్ట్​లో ఉన్నవారికి పంపుతానని బెదిరించింది. మోసపోయానని తెలుసుకున్న అతడు రూ. 2 .50 లక్షలు ఇచ్చి సెటిల్​చేసుకుందామని కోరాడు. అప్పుడు సరేనన్న యువతి కొద్ది రోజులకు మరిన్ని డబ్బుల కోసం వేధించింది. అతడు ఇవ్వడానికి ఒప్పుకోకపోవడంతో అతడి కాంటాక్ట్ లిస్టులోని కొందరికి న్యూడ్​వీడియోలు షేర్ చేసింది. మరింత మందికి వీడియోలు పంపిస్తానని బెదిరించడంతో పోలీసులను ఆశ్రయించాడు. 

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఇన్​స్టా, యూట్యూబ్​ఓపెన్​చేస్తే చాలు ‘బోర్ కొడుతోందా.. రాత్రి పూట ఒక్కరికే నిద్ర పట్టడం లేదా అయితే మీ కోసమే మా యాప్. కింద ఇచ్చిన లింక్ ను ఓపెన్ చేసి గంటల తరబడి మాతో మాట్లాడండి..మీకు మేము ఎక్కడా బోర్ కొట్టనివ్వం. డబ్బులక్కర్లేదు రా అయ్యా.. ముందు లింక్ ఓపెన్ చేయ్.. నేమ్ సేవ్ చేసుకో.. అమ్మాయిలు, అంటీలతో మాట్లాడుకో’ అంటూ ఏఐ జనరేటెడ్​అమ్మాయిలు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నారు. 

రొమాన్స్ చాట్ పేరుతో పద్ధతిగా ఉన్న యువతులు అందంగా నవ్వుతూ మాట్లాడుతున్న వీడియోలను చూస్తున్న కుర్రకారు అట్రాక్ట్​అవుతున్నారు. అమ్మాయిలతో మాట్లాడాలన్న కక్కుర్తితో తప్పులో కాలేసి మోసపోతున్నారు. ముందు నమ్మించి వివరాలన్నీ తెలుసుకుంటున్న అమ్మాయిలు, ఆంటీలు తర్వాత వారిని బ్లాక్ మెయిల్ చేసి అందినకాడికి దండుకుంటున్నారు.  

ఫేక్​ ప్రొఫైల్స్​ క్రియేట్​చేసి...

మన దగ్గర చాలా డేటింగ్స్​యాప్స్​అందుబాటులో ఉండగా, ఎక్కువగా టిండర్, బంబుల్, హింగే, ఓకే క్యూపిడ్, హ్యాప్పెన్ వంటి వాటిని యూత్​ఎక్కువగా వాడుతోంది.  ఇవి ఎక్కువగా ప్రాంతీయ భాషల్లో కూడా సేవలు అందిస్తుండడంతో ఒంటరితనం పోగొట్టుకోవడానికి యువత ఎగబడుతున్నారు. ఎంతలా అంటే సోషల్ మీడియా వాడే సుమారు 75 శాతం మంది మధ్యలో ఏఐతో క్రియేట్​చేసే డేటింగ్​యాప్స్​యాడ్స్​కనిపిస్తే అక్కడే ఆగిపోతున్నారు. దీంతో అందరికీ స్క్రోల్​చేస్తుంటే ఇలాంటి వీడియోలే వస్తున్నాయి. దీన్ని క్యాష్​చేసుకోవాలనుకుంటున్న కొందరు డేటింగ్​యాప్స్​లో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తున్నారు. 

ఆకర్షణీయమైన ఫొటోలు, వీడియోలు పెట్టి వాయిస్​కాల్స్​, చాటింగ్ చేస్తున్నారు. తర్వాత ముగ్గులోకి లాగి అత్యవసర పరిస్థితులంటూ మొత్తం లాగేసుకుంటున్నారు. హాస్పిటల్​ఖర్చులని, అమ్మకు ఆరోగ్యం బాగాలేదని ఇలా రకకరకాల కారణాలు చెప్తూ జేబులు ఖాళీ చేస్తున్నారు. వీడియో కాల్స్ మాట్లాడేవారిని న్యూడ్​కాల్స్​దాకా తీసుకువెళ్లి రికార్డ్​చేసి బ్లాక్​మెయిల్​చేస్తున్నారు. బయట తెలిస్తే పరువు పోతుందని అడిగినంతా సమర్పించుకుంటున్నారు. ఇలా 2025లో సుమారు 569 కేసులు నమోదయ్యాయని పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనల్లో బాధితులు రూ.2.8 కోట్లకు పైగా నష్టపోయారు. ముఖ్యంగా సిటీలోని సైబర్ క్రైమ్ పోర్టల్, హెల్ప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్లకు రోజూ ఇలాంటి ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. 

ఫేక్​ యాప్ ​లతోనూ...

మన దేశంలో డేటింగ్ యాప్​లకు ప్రత్యేక లైసెన్స్ వ్యవస్థ లేకపోయినా, అధికారిక యాప్ స్టోర్లలో అందుబాటులో ఉంటూ లీగల్​గానే పనిచేస్తున్నాయి. అయితే, కొందరు వీటి పేరుతో ఫేక్​యాప్​లు క్రియేట్​చేసి దండుకుంటున్నారు. ఏఐ ఉపయోగించి డీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫేక్ ఫొటోలు, వీడియోలు తయారు చేసి సోషల్​మీడియాలో ఒరిజినల్​యాప్​లంటూ లింక్​లు పంపిస్తున్నారు. 

అలాగే ‘ఫ్రెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ క్లబ్,‘ప్రైవేట్ చాట్’‘లోకల్ కనెక్ట్’ యాప్​లను పోలిన ఫేక్​యాప్​లు.. వాట్సాప్ ద్వారా లింక్​లు పంపి చీట్​చేస్తున్నాయి. డౌన్​లోడ్ చేసుకున్నాక లాగిన్​అయ్యేప్పుడు ఇచ్చే పర్సనల్​ఇన్ఫర్మేషన్, బ్యాంక్ వివరాలు తీసుకుంటున్నారు. తర్వాత మొత్తం వ్యక్తిగత సమాచారం సేకరించి దర్జాగా ఏడాదికి రూ. కోట్లు కొల్లగొడుతున్నారు. 

పోలీసులు ఏమంటున్నారంటే..

ఈ మధ్య డేటింగ్​యాప్స్​తో మోసపోతున్న వారి సంఖ్య పెరుగుతోందని, అలాంటి వీడియోలను నమ్మకూడదంటున్నారు. వాటి ద్వారా వచ్చే లింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్ చేయకూడదని హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత సమాచారం ఎవరితోనూ పంచుకోకూడదని సలహా ఇస్తున్నారు.  అనుమానం వస్తే సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. సైబర్ హెల్ప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ 1930కు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.

యువతే లక్ష్యంగా..

డేటింగ్ యాప్ మోసాల్లో 18 నుంచి 35 ఏండ్ల మధ్య వయస్సున్న యువతే ఎక్కువగా మోసాల భారిన పడుతున్నారు. వీరు ప్రేమ, రిలేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ కోసం ఎదురుచూడడం ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు ఫోన్లు ఎక్కువగా వాడతారు. కాబట్టి ఈ వయస్సుల వారినే టార్గెట్​చేసుకుంటున్నారు. మోసపోయిన తర్వాత ఎవరికైనా తెలిస్తే పరువు పోతుందని బయటపడడం లేదు.