గ్రేస్ అనాథాశ్రమంలో వెలుగు చూసిన దారుణం

గ్రేస్ అనాథాశ్రమంలో వెలుగు చూసిన దారుణం

డీఏవీ స్కూల్ ఘటన మరువక ముందే అలాంటి ఉదంతమే మరొకటి చోటు చేసుకుంది. నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికపై అఘాయిత్యం ఘటన వెలుగులోకి వచ్చింది. జేజే నగర్లోని గ్రేస్ అనాథాశ్రమంలో ఈ ఘటన జరిగింది. ఈ నెల 19న గ్రేస్ అనాథాశ్రమానికి చెందిన నలుగురు బాలికలు కనిపించకుండా పోయారు. దీంతో నిర్వాహకులు నేరేడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తప్పిపోయిన వారిలో ఒకమ్మాయి మేజర్ కాగా.. మిగిలిన ముగ్గురు మైనర్లు. కంప్లైంట్ ఆధారంగా మిస్సింగ్ కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వారిలో ఇద్దరు బాలికలు సికింద్రాబాద్ లో దొరకగా.. రెండ్రోజుల తర్వాత మరో ఇద్దరు సంగారెడ్డిలోని తమ బంధువుల ఇంట్లో దొరికారు. వారందరినీ కౌన్సిలింగ్ కోసం సఖి సెంటర్ కు తరలించగా.. అఘాయిత్యం ఘటన బయటపడింది. 

సఖి సెంటర్లో కౌన్సిలింగ్ సందర్భంగా గ్రేస్ అనాథాశ్రమంలో అకౌంటెంట్గా పనిచేస్తున్న మురళి లైంగికంగా వేధించినట్లు ఓ బాలిక చెప్పింది. ఆ కారణంగానే అక్కడ ఉండటం ఇష్టంలేక తప్పించుకుని పోయినట్లు వివరించింది. బాలిక ఇచ్చిన సమాచారం ఆధారంగా కేసు నమోదుచేసిన గోపాలపురం పోలీసులు నిందితుడు మురళిపై పోక్సో, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు, గ్రేస్ అనాథశ్రమం నిర్వాహకుడు విక్టర్ అతని భార్య భవానిపై జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద కేసు బుక్ చేసి రిమాండ్ కు తరలించినట్లు నేరేడ్మెట్ ఇన్స్పెక్టర్ నరసింహ స్వామి చెప్పారు.