
లార్డ్స్ టెస్టులో చేతుల్లోకి వచ్చిన విజయాన్ని వదిలేసుకున్న టీమిండియా.. ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్లో 1–2తో వెనుకంజలో ఉంది. సిరీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే మాంచెస్టర్ వేదికగా ఈ నెల 23 నుంచి జరగబోయే నాలుగో టెస్టులో గిల్ సేన తప్పకుండా విజయం సాధించాల్సిన పరిస్థితి. ఈ కీలకమైన నాలుగో టెస్టులో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉండడం టీమిండియాకు కలిసి వచ్చేదే. ఈ సిరీస్లో కేవలం మూడు మ్యాచ్లే ఆడతాడని కోచ్ గౌతమ్ గంభీర్ ఇప్పటికే స్పష్టం చేయడంతో ఈ నెల 23న నుంచి జరిగే నాలుగో టెస్టుకు అందుబాటులో ఉంటాడా లేదా అనే విషయం చర్చనీయాంశంగా మారింది.
ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా బుమ్రా మాంచెస్టర్ టెస్టులో ఆడడం దాదాపు ఖాయంగా మారినట్టు రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఒకవేళ బుమ్రా నాలుగో టెస్టులో ఆడకపోతే టీమిండియా బౌలింగ్ బలహీనంగా మారుతుంది. అదే జరిగితే ఇప్పటికే 1-2 తో వెనకబడిన టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కోల్పోయే ప్రమాదం ఉంది. అయితే బుమ్రా జట్టులో ఉంటే టీమిండియా మ్యాచ్ ఓడిపోతుందని ఇంగ్లాండ్ దిగ్గజ బ్యాటర్ డేవిడ్ లాయిడ్ అనడం సంచలనం రేపుతోంది. ఈ సందర్భంగా బుమ్రా ఆడినప్పుడు, టీమిండియా ఎక్కువ మ్యాచ్ లు ఓడిపోతుందని లాయిడ్ తెలిపాడు.
ALSO READ : Shubman Gill: ట్రయాంగిల్ లవ్: సారా చూపు గిల్ వైపు.. వేరే అమ్మాయితో టీమిండియా కెప్టెన్
"బుమ్రా ఆడినప్పుడు, టీమిండియా ఎక్కువగా మ్యాచ్ లు ఓడిపోతుంది. అది అసాధారణమైన విషయం. అతను ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్. మంచి వ్యక్తి. ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ బుమ్రా మూడు టెస్టులే ఆడతానని చెప్పాడు. అతను ఇప్పటికే రెండు మ్యాచ్లు ఆడాడు. అతను తదుపరి మ్యాచ్లో ఆడాలి. నాలుగో టెస్ట్ గెలిస్తే చివరి మ్యాచ్లో కూడా అతను ఆడాలని మీరు కోరుకుంటారు. అతను తదుపరి టెస్ట్ ఆడతాడని నేను అనుకుంటున్నాను. ఇంగ్లాండ్ 3-1 ఆధిక్యంలో ఉంటే, అతను ఆడడు. కానీ సిరీస్ 2-2 గా ఉంటే అతను ఓవల్లో ఆడతాడు". అని టాక్స్పోర్ట్ క్రికెట్తో డేవిడ్ లాయిడ్ అన్నాడు.
బుమ్రా టీమిండియా తరపున ఇప్పటివరకు 47 టెస్టులు ఆడాడు. వీటిలో భారత్ 20 మ్యాచ్ ల్లో గెలిస్తే మరో 23 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. 2018లో బుమ్రా అరంగేట్రం చేసినప్పటి నుండి బుమ్రా ఆడని 27 టెస్ట్ మ్యాచ్ల్లో ఐదు ఓడిపోయింది. భారతదేశం 19 మ్యాచ్ల్లో విజయం సాధించగా.. మరో మూడు డ్రాగా ముగిశాయి. ఇప్పటికే ఆడిన మూడు టెస్టుల్లో బుమ్రా.. ఎడ్జ్ బాస్టన్ టెస్ట్ కు దూరమయ్యాడు. తొలి టెస్టుతో పాటు లార్డ్స్ టెస్టులో బరిలోకి దిగాడు. ఈ సిరీస్ లో బుమ్రా ఆడిన రెండు టెస్టుల్లో టీమిండియా ఓడిపోయింది. బుమ్రా ఆడని ఎడ్జ్ బాస్టన్ టెస్ట్ భారత్ విజయం సాధించింది.
ఈ సిరీస్లో బుమ్రా ఇప్పటివరకు రెండు టెస్టులు ఆడాడు. లీడ్స్లో 43.4 ఓవర్లు బౌలింగ్ చేసి ఐదు వికెట్లు తీశాడు. బర్మింగ్హామ్లో రెస్ట్ తీసుకోగా.. అక్కడ సిరాజ్, ఆకాశ్ దీప్ అద్భుతంగా రాణించి ఇండియాకు విజయాన్ని అందించారు. లార్డ్స్లో మూడో టెస్టుకు తిరిగి వచ్చిన బుమ్రా 43 ఓవర్లు బౌలింగ్ చేసి ఏడు వికెట్లు పడగొట్టాడు. టీమ్ మేనేజ్మెంట్ తను ఎక్కువ స్పెల్స్ బౌలింగ్ చేయకుండా జాగ్రత్తపడుతోంది. ఓవరాల్ గా రెండు టెస్టుల్లో బుమ్రా 12 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మూడో టెస్టు ముగిసిన తర్వాత చిన్న గ్యాప్ తీసుకున్న ఇండియా మాంచెస్టర్ మ్యాచ్ కోసం గురువారం బెకెన్హామ్ కౌంటీ గ్రౌండ్లో శిక్షణ ప్రారంభించింది.