
జగిత్యాల జిల్లా కొండగట్టు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న కారును డీసీఎం ఢీ కొట్టింది. ఈ ఘటనలో మూడు నెలల చిన్నారి మృతి చెందగా..వరుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పెళ్లి ఆగిపోయింది.
అసలేం జరిగిందంటే.. జూన్ 4న రాత్రి మహారాష్ట్ర నాంధేడ్ నుంచి కరీంనగర్ కు వస్తుండగా కొండగట్టు దగ్గర పెళ్లి బృందం కారును డీసీఎం ఢీ కొట్టింది. ఈ ఘటనలో చిన్నారి రుద్ర అక్కడిక్కడే చనిపోగా..వరుడికి తీవ్ర గాయాలయ్యాయి. జూన్ 5న 7: 56 గంటలకు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో పెళ్ళి జరగాల్సి ఉంది. వరుడికి తీవ్ర గాయాలు కావడంతో పెళ్లి నిలిచిపోయింది. క్షతగాత్రులను పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చిన్నారి మృతి, వరుడికి గాయాలతో పెళ్లి ఇంట విషాదం నెలకొంది. చిన్నారి మృతితో బంధువులు, కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. కాసేపట్లో బ్యాండ్ బాజాలతో హంగామా జరగాల్సిన ఇల్లు..ఇలా విషాదంలో మునిగిపోవడంతో ఆందోళన చెందుతున్నారు.