చనిపోయిన ఆరు నెలలకు వ్యాక్సిన్ వేసుకున్నాడట

చనిపోయిన ఆరు నెలలకు వ్యాక్సిన్ వేసుకున్నాడట

మధ్యప్రదేశ్ : దేశంలో కరోనా వ్యాక్సినేషన్ శరవేగంగా కొనసాగుతోంది. రాష్ట్రాలు వీలైనంత తొందరగా ఈ ప్రక్రియ పూర్తి చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో వైద్య ఆరోగ్య సిబ్బంది పలు తప్పులు చేస్తున్నారు. వ్యాక్సిన్ వేయకుండానే వేసినట్లు మెసేజ్ లు పంపుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా చనిపోయిన వ్యక్తులకు కోవిడ్ టీకా వేసినట్లు మెసేజ్ లు రావడంతో వారి కుటుంబసభ్యులు షాకవుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ లో ఇలాంటి ఉదంతమే చోటు చేసుకుంది. 

రాజ్ ఘడ్ జిల్లాకు చెందిన పురుషోత్తం అనే వ్యక్తి ఈ ఏడాది ఏప్రిల్ 8న కోవిడ్ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నాడు. అయితే అనారోగ్య కారణాలతో ఆయన మేలో మృతి చెందాడు. తాజాగా డిసెంబర్ 3న పురుషోత్తం సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు ఆయన సెల్ ఫోన్ కు మెసేజ్ వచ్చింది. అది చూసి కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. వ్యాక్సిన్ సర్టిఫికేట్ డౌన్ లోడ్ చేయగా.. అందులో రెండు డోసులు పూర్తైనట్లు ఉంది. విషయాన్ని డిస్ట్రిక్ట్ వ్యాక్సినేషన్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లగా.. కంప్యూటర్ ఎర్రర్ కారణంగా ఇలా జరిగి ఉండవచ్చని చెప్పారు. దీనిపై దర్యాప్తునకు ఆదేశించినట్లు చెప్పారు. మరోవైపు  బియోర బ్లాక్ మెడికల్ ఆఫీసర్ మాత్రం భారీ స్థాయిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నందున ఇలాంటి పొరపాట జరిగి ఉండొచ్చని అన్నారు. తమ సిబ్బంది పొరపాటున పురుషోత్తం ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఉంటారని చెప్పారు. త్వరలోనే తప్పును సరిచేస్తామని అన్నారు.