స్కూళ్ల ప్రారంభానికి తొందర వద్దు

స్కూళ్ల ప్రారంభానికి తొందర వద్దు

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో చాలా రాష్ట్రాలు ఆంక్షలను సడలించాయి. కొన్ని నిబంధనలతో స్కూళ్లను తిరిగి తెరవాలని కూడా ప్రభుత్వాలు నిర్ణయించాయి. అయితే.. ఈ నిర్ణయం సరైంది కాదన్నారు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్. ప్రస్తుతం కరోనా పరిస్థితులను అంచనా వేయకుండా  స్కూళ్లను తెరవడం మంచిది కాదన్నారు. ఆయా ప్రభుత్వాల ఈ నిర్ణయం.. విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టడమే అవుతుందని హెచ్చరించారు.

పాఠశాలలో టీచర్, హెల్పర్, విద్యార్థులు అందరూ ఒకే చోట ఉంటారని.. దీంతో వైరస్ వ్యాప్తికి మరింత అవకాశం ఇచ్చినట్టు అవుతుందన్నారు వీకే పాల్. కాబట్టి ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందించి రక్షణ కల్పించిన తర్వాతనో, లేదంటే వైరస్ దాదాపు కనుమరుగైన తర్వాతనో ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. గతంలో స్కూళ్లు తెరిచినప్పుడు కూడా వైరస్ వ్యాప్తి పెరిగిందని గుర్తు చేశారు.

ఆయా రాష్ట్రాలు తీసుకున్న చర్యలతో పాటు ప్రజలు క్రమశిక్షణగా ఉండడం కారణంగానే ప్రస్తుతం వైరస్ తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తోందన్నారు వీకే పాల్. ఇప్పుడు మళ్లీ స్కూళ్లు ప్రారంభమైతే వైరస్‌ మళ్లీ విజృంభించే అవకాశం  ఉందన్నారు. ఈ విషయంలో తొందరపాటు వద్దన్నారు.