- మిగతా దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ బెటర్
- ప్రకటన ఖర్చులో దేశ గ్రోత్ రేట్ కన్నా ఎక్కువే
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మీడియాకు యాడ్స్ పెరుగుతున్నాయని మీడియా సంస్థల అధినేతలు, ప్రముఖులు పేర్కొన్నారు. మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో కొన్ని నెలలుగా యాడ్స్ తగ్గుతున్నా.. తెలంగాణలో మాత్రం పాజిటివ్ గ్రోత్ ఉందని అన్నారు. ప్రకటనల ఖర్చు విషయానికి సంబంధించి జాతీయ వృద్ధి రేటు 5 నుంచి 6 శాతం ఉంటే.. రాష్ట్రంలో 8 నుంచి 9 శాతం వరకు ఉన్నట్టు అంచనా వేశారు. దేశంలోని ప్రముఖ మీడియా ఔట్సోర్సింగ్ కంపెనీ ఫోర్త్ డైమెన్షన్ మీడియా ఆధ్వర్యంలో ‘డీకోడింగ్ మీడియా ఇన్ తెలంగాణ’ అనే అంశంపై మంగళవారం ఇ–కాన్క్లేవ్ నిర్వహించారు. ఈ సదస్సుకు వీ6 సహకారం అందించగా, వెలుగు దినపత్రిక కో స్పాన్సర్గా వ్యవహరించింది. సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో మీడియా వినియోగంలో ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణ పూర్తి భిన్నంగా ఉందని మీడియా ప్రముఖులు అన్నారు. తెలంగాణను ఏపీతో కలిపి ప్రస్తావించడం లేదని, ఇప్పుడు మీడియా విషయంలో, ప్రకటనల విషయంలో రాష్ట్రానిది ప్రత్యేక స్థానమన్నారు. ప్రజలు, పరిశ్రమలను ఇటీవల బాగా ఆకర్షించిన అంశాలపై ఈ సందర్భంగా వారు చర్చించారు. ఈ చర్చలో విల్ మీడియా (వీ6 వెలుగు) డైరెక్టర్ వైష్ణవి గడ్డం, ఓఎంజీ మీడియా గ్రూప్ సౌత్ ఏషియా సీఈవో కార్తీక్ శర్మ, టామ్ మీడియా రీసెర్చ్ సీఈవో ఎల్వీ కృష్ణన్, ఘంట ఫుడ్స్(బాంబినో) సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ ధీరజ్ నాయుడు, వర్మిలియన్ కమ్యూనికేషన్ మీడియా హెడ్ సురభి గుప్తా, పెన్నా సిమెంట్స్ మార్కెటింగ్ కమ్యూనికేషన్స్ హెడ్ జాకబ్ మాథ్యూ, వేవ్ మేకర్ చీఫ్ క్లైంట్ ఆఫీసర్ శేఖర్ బెనర్జీ మాట్లాడారు. స్టార్ మా యాడ్ సేల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అనురాధ మధు అగర్వాల్ ప్యానలిస్ట్గా వ్యవహరించారు.