
- 29 నుంచి ప్రత్యక్ష విచారణ చేపట్టే అవకాశం
హైదరాబాద్, వెలుగు: పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కాలె యాదయ్య, అరికపూడి గాంధీ, ప్రకాశ్ గౌడ్ శుక్రవారం అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో భేటీ అయ్యారు. ఇందులో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మందిలో ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు తమ వివరణలను స్పీకర్ కు అందజేయగా.. కడియం, దానం తమ వివరణలను అందించలేదు.
కడియం మాత్రం ఈ నెల 30లోపు వివరణ ఇస్తానని చెప్పినట్టు తెల్సింది. ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలంటూ ఇటీవలే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లీగల్ ఫార్మెట్ లో ఆధారాలతో సహా అఫిడవిట్ ల రూపంలో స్పీకర్ కు అందజేశారు. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడి ఇరు వర్గాల వాదనలు వినాలని స్పీకర్ నిర్ణయించారు. ఈ నెల 29 నుంచి స్పీకర్ కార్యాలయంలోనే గడ్డం ప్రసాద్ ఇరు వర్గాలను ముఖాముఖి కూర్చోబెట్టి ఇద్దరి వాదనలను వినాలని నిర్ణయించుకున్నారు.